Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుములు రేవంత్రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లాలో తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వెళ్లిన రైతు ఆ మార్కెట్లోనే మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా ఆదివారం పార్టీ తరుపున నాలుగు బృందాలు పర్యటిస్తాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు, దళిత బంధు, నిరుద్యోగం వంటి సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శనివారం గాంధీభవన్లో రైతాంగ సమస్యలపై పార్టీ సీనియర్లతో రేవంత్ సమావేశమయ్యారు. అనంతరం పార్టీ సీనియర్ నేత జి చిన్నారెడ్డి, మల్లు రవి, దాసోజు శ్రవణ్, నాయకులు మానవతారారు, ప్రీతమ్, శివసేనారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వరి వేస్తే ఉరి వేసుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రైెతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అన్నివిధాలుగా నష్టపోతున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని ఎన్నికలు ముగిసినప్పటికీ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వని సీఎం కేసీఆర్...వైన్ షాపులకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని చెప్పారు. రైతాంగ సమస్యలపై పర్యటించి పీసీసీకి నివేదిక సమర్పిస్తామన్నారు.
మరణించిన రైతు కుమారుడికి రేవంత్ ఫోన్
వడ్ల కుప్ప మీదనే గుండె ఆగిన రైతు బీరయ్య కుమారుడు రాజేందర్తో శనివారం రేవంత్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ ఈ క్రమంలో గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.