Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రెండో స్థానంలో తాండూరు జిల్లా ఆస్పత్రి
- నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయనీ, ఒక్క అక్టోబర్ నెలలోనే 782 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. శనివారం పట్టణంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్లో 686 ప్రసవాలు జరగగా.. అందులో 374 సాధారణ, 312 సిజేరియన్ అని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో 782 ప్రసవాలు జరిగాయనీ, అందులో 413 సాధారణ, 369 సిజేరియన్ అని చెప్పారు. వరుసగా రెండు నెలల్లో అత్యధిక ప్రసవాలు జరగడంతో తాండూర్ జిల్లా ఆస్పత్రి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందన్నారు. ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం వైద్యులు, సిబ్బంది సహకారంతో ఈ ఘనత సాధ్యం అయిందని తెలిపారు. అదేవిధంగా తాండూర్ పట్టణ కేంద్రంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. తాండూర్లో నర్సింగ్ కళాశాల, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తాండూరులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మాతా శిశుఆస్పత్రి(ఎంసీహెచ్)లో వచ్చే 15 రోజుల్లో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం, ఆపరేషన్ థియేటర్, నవజాత శిశు కేంద్రం, ఎన్ఆర్సీ విభాగాలతో పాటు మాత, శిశు ఓపీ వైద్య సేవలను అక్కడికే తరలిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్, గోపాల్రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.