Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేకుల షెడ్డులో జీవనం
- కనీస వసతుల్లేక అవస్థలు
- రోజు కూలి రూ.350
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులు
నేరేడ్మెట్ (హైదరాబద్)నుంచి సంకసర్ల సువర్ణ
వాళ్ల జీవితాల్లో సుఖాలు.. సంతోషాలకంటే ద్ణుఖాలే ఎక్కువ. పనిచేస్తే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి.. లేదంటే అర్ధాకలితోనో, ఖాళీ కడుపుతోనో రోజులు గడపాలి.. బతుకంతా అనుక్షణం భయమూ, బెదురూ, ఆకలి దు:ఖాలే. ఊరూ, పేరు తెలియని, భాష రాని చోట, పుట్టి పెరిగిన ఊరికి వందల కిలోమీటర్ల దూరంలో పొట్టకూటి కోసం బతుకులు.. ఇదీ బిల్డింగుల దగ్గర పనిచేసే వలస కార్మికుల దుస్థితి. పని ప్రదేశాల్లో కావాల్సిన సదుపాయాలు ఉండవు. ఒకేసారి గుత్తకు జతకు ఇంత కూలి అంటూ కాంట్రాక్టర్లు మాట్లాడుకుని తీసుకొస్తే.. చంటి బిడ్డల్ని చంకలేసుకుని హైదరాబాద్ మహానగరానికి వస్తున్నారు. రేకుల షెడ్డుల్లో కనీసం పడుకోవడానికి సరిపోని చిన్న స్థలంలో నివాసాలు. ఒకరి కాళ్ల దగ్గర మరొకరు.. కాళ్లు ముడుచుకుని పడుకోవాలి. మూడేండ్ల పిల్లల వద్ద మూడు నెలల పసికందులను వదిలేసి పనుల్లోకెళ్తున్నారు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుల బతుకులపై 'నవతెలంగాణ' పరిశీలనాత్మక కథనం.
నేరెడ్మెట్ డివిజన్లోని ఆనంద్బాగ్లో ఒక ప్రయివేటు గ్రూప్ నిర్మాణంలో 25 భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు పనులు చేస్తున్నాయి. దాదాపు 50 మంది వరకు కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఒక్కో కుటుంబం ఒక్కో రేకుల షెడ్డులో నివాసం ఉంటుంది. వారికి కేటాయించిన రేకుల గదిలోనే మట్టితో కూడిన పొయ్యిని ఏర్పాటు చేసుకుని వంట చేసుకుంటున్నారు. ఆ గదిలోనే విశ్రాంతి తీసుకోవడం, చంటి పిల్లలు ఉంటే అందులోనే ఉయ్యాల కట్టి ఆడిస్తున్నారు. వీరు పనులకు వెళ్లినప్పుడు చంటి పిల్లల్ని చూసుకునేందుకు సంరక్షకులు ఎవరూ లేరు. వారితో వచ్చిన 5,6 ఏండ్ల వయసు ఉన్న పిల్లలే ఆ పిల్లల్ని చూసుకోవాలి. కాంట్రాక్టరు వీరి పేరు మీద ఎంత తీసుకున్నాడో కానీ వీరికి ఒక చిన్న రేకుల షెడ్డు మాత్రమే కేటాయించడంతో బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రోజుకు కేవలం రూ.350 మాత్రమే కూలి ఇస్తున్నారు. వారితో వచ్చిన పిల్లల విద్య, వైద్యం, పోషణ కోసం అవసరమయ్యే ఖర్చు, ఇంటి సామాన్లు, రేషన్ అన్ని వారికి ఇచ్చే రూ.350తో సరిపెట్టుకుంటున్నారు. రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ చట్టం, 1996 ప్రకారం వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా సదుపాయాలు అందుబాటులో లేవు.
సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సినవి..
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, అంగవైకల్యం ఏర్పడితే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు, సహజ మరణం చెందితే రూ.లక్ష, అంత్యక్రియల నిమిత్తం రూ.30వేలు కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అందించాలి. వివాహ కానుకగా రూ.30వేలు, ప్రసూతి సహాయం రూ.30వేలు, తాత్కాలిక అస్వస్థతకు 5 రోజులు ఆస్పత్రిలో ఉంటే రోజుకు రూ.300 చొప్పున నెలకు రూ.4500 వరకు ఆర్థిక సహాయం చొప్పున భవన నిర్మాణ కార్మికులకు అందజేయాల్సి ఉన్నా.. అవేమీ అమలులో లేవు.
మధ్యప్రదేశ్ నుంచి వచ్చాం.. భవన నిర్మాణ కార్మికురాలు
మేం మధ్యప్రదేశ్ నుంచి వచ్చాం. నేను, నా భర్త ఇక్కడ పని చేయడానికి వచ్చాం. మాకు రోజు వారీ కూలి ఒక్కరికి రూ.350 చొప్పున రూ.700 వస్తుంది. ఇందులోనే రోజుకు కావాల్సిన నిత్యావసరాలు తెచ్చుకుంటాం. కాంట్రాక్టరు మాకు కేటాయించిన గదిలో మట్టి పొయ్యి ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. అదే గదిలో విశ్రాంతి తీసుకుంటాం. మేం ఈ పనికి వచ్చి రెండేండ్లు అయింది. ఇద్దరు పిల్లలతో ఇక్కడికి వచ్చాం. పాఠశాల మొదలైనందున పెద్ద పాపను సొంతూరుకు పంపించాం. మాతో చిన్న పాప ఉంది. మేము పనులకు వెళ్తే కాస్త పెద్ద వయసు పిల్లలు వారిని చూసుకుంటున్నారు. మాలాగా ఇక్కడ పనిచేసే 20 కుటుంబాలు ఉన్నాయి.
రూ.600-800 వరకు కూలి ఇవ్వాలి
తెలంగాణలోని భవన నిర్మాణ కార్మికులకు రూ.600 నుంచి రూ.800 వరకు కూలి ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది కాంట్రాక్టర్లు మధ్యప్రదేశ్, ఒరిషా,బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి గుత్తగా తీసుకొస్తున్నారు.కార్మిక సంఘాలు ఉన్నాయనే విషయం కూడా ఆ కార్మికులకు తెలియదు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడో, మాట్లాడుకున్న కూలికి సంబంధించిన డబ్బులు రాకపోతేనో తమ దగ్గరికి వస్తున్నారు.
జాజుల బాలన్న- తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం (టీబీఎన్కే) రాష్ట్ర అధ్యక్షులు
సదుపాయాలు కల్పించాలి
వలస కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డు ఇచ్చి ప్రభుత్వ సదుపాయాలు అందేలా చూడాలి. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షలు కాకుండా కార్మిక చట్టం ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వాలి. 58 ఏండ్లు ఉన్న కార్మికులకు నెలకు ఏడున్నర వేలు పెన్షన్ ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
మొట్టె నర్సింహా, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వమే చూడాలి
1979 చట్టం ప్రకారం.. వలస కార్మికులందరూ కార్మిక శాఖలో పేర్లు నమోదు చేసుకోవాలి. గుత్తేదారుకు, బిల్డర్కు కొంతమంది దళారులు మధ్యవర్తులుగా ఉండి అతి తక్కువ కూలి ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారు. 12 గంటల నుంచి 14 గంటలు పగలు, రాత్రి అని తేడా లేకుండా అతి తక్కువ వేతనాలు ఇస్తూ అత్యధిక శ్రమ దోపిడీ చేస్తున్నారు. కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు కార్డులు ఇవ్వాలి.
వంగూరు రాములు - తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు