Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ ధర కంటే 30 శాతం తక్కువ పరిహారం
- డిమాండ్తో ప్యాకేజీకి ఆదరణ కరువు
- డైలమాలో హెచ్ఎండీఏ డ్రీమ్ ప్రాజెక్టు
- 1500 ఎకరాల ల్యాండ్ పూలింగ్ హెచ్ఎమ్డీఏ కలగానే మిగలనుంది
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
హెచ్ఎండీఏ డ్రీమ్ ప్రాజెక్టు ల్యాండ్ పూలింగ్కు ఆదరణ కరువైంది. భూ యాజమానుల వాటాను 60 శాతానికి పెంచినా స్పందన లేదు. ప్రస్తుత మార్కెట్ ధరతో పోల్చితే 30 శాతం తక్కువ పరిహారం ఉండటంతో హెచ్ఎండీఏ డ్రీమ్ ప్రాజెక్టుకు బ్రేకులు పడుతున్నాయి. దాంతో వందల ఎకరాల భూములను సేకరించి, డెవలప్ చేసి, అమ్ముకునేలా రూపొందించిన ప్రణాళికలేవీ కార్యరూపం దాల్చడం లేదు. ప్రయివేటు భూములు సేకరించడం, వాటిని అభివృద్ధి చేయడం, ఆ తర్వాత వేలం వేయడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్కు శ్రీకారం చుట్టింది. నగర శివారుల్లో రియల్ వ్యాపారానికి అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ప్రయివేటు భూముల సేకరణకు రెండేండ్ల కిందట నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ స్కీంలో హెచ్ఎండీఏకు భూములిచ్చేందుకు భూ యజమానులు తొలుత ఆసక్తి చూపినా,అగ్రిమెంట్లు దశకు వచ్చేసరికి ఆగిపోతున్నది. దాంతో నగర శివారుల్లో దాదాపు 1500ఎకరాల భూములను పూలింగ్ చేయాలనే హెచ్ఎండీఏ కల కలగానే మిగిలేలా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి,మేడ్చల్ని కొర్రెముల్లా, ప్రతాపసింగారం.. భూము లు సమీకరించడానికి హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తొలిదశలో భాగంగా గ్రామ సభలను నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది. కానీ చివరకు ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయింది. ఇంతలో వచ్చిన కరోనాతో ఆ ప్రాజెక్టు కాస్తా కోల్డ్ స్టోరేజీలో పడింది. రైతుల నుంచి సమీకరించిన భూములను ముందుగా హెచ్ఎండీఏ ప్లాట్లుగా తీర్చిదిద్దుతోంది. ఆ తర్వాత భూములిచ్చినవారికి వాటాలను పంచుతోంది. అయితే ఈ వాటా తొలుత 50 శాతం ఉండగా, ఆ తర్వాత 60 శాతానికి పెంచినా కూడా ఆదరణ రావట్లేదు. ఈ లెక్కన డెవలప్ చేసిన మొత్తం ప్లాట్లలో 60శాతం ల్యాండ్ ఓనర్లకే దక్కనున్నాయి.
మార్కెట్ రేటు కంటే 30శాతం తక్కువ
డెవలప్ చేసిన ప్లాట్లపై చెల్లించే పరిహారం మార్కెట్ ధరల కంటే 30 శాతం పైనే తక్కువగా ఉండటంతోనే ఇవ్వడం లేదని భూ యజమానులు చెబుతున్నారు. నగర శివారుల్లో ప్రధానమైన ఏరియాల్లో ఎకరం రూ.2 నుంచి 10 కోట్ల మధ్య ఉంది. సమీకరించిన భూమిలో.. రోడ్లు, పవర్ సప్లరు, మంచినీటి సదుపాయాలను కల్పించి 60శాతం భూమి రైతులకు అందుతోంది. ఈ లెక్కన చూసిన మూడు కోట్ల భూమిని.. అభివృద్ధి పేరిట తీసుకుని, తక్కువ భూమిని కేటాయించడంతోనే యజమానులు ముందుకు రావట్లేదు. కరోనా కంటే ముందు శంకర్పల్లిలో ల్యాండ్ పూలింగ్పై అవగాహన కల్పించారు. అక్కడ ఎకరం ధర రూ.5 కోట్లపైన ఉంది. హెచ్ఎండీఏ ఇచ్చే డెవలప్ ప్లాట్ ధర రూ.2 కోట్లు కూడా లేదని శంకర్పల్లికి చెందిన భూ యజమానులు తెలిపారు. తానే స్వయంగా డెవలప్ చేసుకుంటే ఎకరంలో 125 గజాల చొప్పున ప్లాట్లు రూపొందించిన అంతకు మించిన లాభం వస్తుందనీ, చివరకు డెవలప్మెంట్ కిచ్చిన హెచ్ఎండీఏ కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని వివరించారు. దాంతో భూములు సేకరించి, అభివృద్ధి చేయాలన్న హెచ్ఎండీఏ డ్రీమ్ ప్రాజెక్టు కలగానే మిగిలిపోయేలా ఉంది.
ప్రభావితం చేస్తున్న ధరలు
వాస్తవానికి ల్యాండ్ పూలింగ్ స్కీంలో భాగంగా హెచ్ఎండీఏతో అగ్రిమెంట్ చేసుకుంటే... ల్యాండ్ ఓనర్లకు ప్రయోజనాలు ఉన్నాయని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ఎలాంటి పెట్టుబడి లేకుండానే అభివృద్ధి చేసిన ప్లాట్లను సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. పరిహారం కింద కేటాయించిన ఈ భూములను రైతులు నేరుగా అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ఉన్న బీడు భూముల కంటే, డెవలప్డ్ ప్లాట్లకు మరింత రేట్ను పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రయివేటు వ్యాపారులు ఇచ్చే ప్యాకేజీలతో పోల్చుకుని హెచ్ఎండీఏ ఆఫర్కు ఆదరణ లేకుండా పోయిందంటున్నారు.