Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీతో నిఖరంగా కొట్లాడితేనే జనం నమ్ముతరు: జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం ప్రభుత్వం, బీజేపీ పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరు అపరిచితుడు పాత్రను పోలి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పెడ్తా..బీజేపీపై యుద్ధం చేస్తా..మెడలు వంచుతా..అంటూనే ఢిల్లీలో మోడీ, అమిత్షా వద్దకెళ్లి వంగివంగి దండాలు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆది నుంచీ కేసీఆర్ బీజేపీతో సన్నిహితంగానే ఉంటున్నాడని విమర్శించారు. నేడు తెలంగాణలో బీజేపీ నేతలు ఇలా మాట్లాడటానికి, సీట్లు గెలవడానికి కారణం కేసీఆర్ ఇచ్చిన అవకాశమేనని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు పలు కీలక బిల్లులు నెగ్గేందుకు అవసరమున్న ప్రతిసారీ టీఆర్ఎస్ పార్టీ సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలోనూ, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పోరాడుతా అంటూనే బీజేపీ అగ్రనేతలకు వంగివంగి దండాలు పెడితే ఇక ప్రజలు అస్సలు నమ్మబోరని పేర్కొన్నారు. ఏదో ఆవేశం పుట్టుకొచ్చినప్పుడు నాలుగు మాటలు మాట్లాడే ధోరణిని విడనాడాలనీ, కేంద్రంపై నిరంతం పోరాడాలని సూచించారు.