Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ నిర్వాసితుల సంఘం సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భూసేకరణ చట్టం-2013 అమలు చేయాలనే డిమాండ్ తో డిసెంబర్ 10న హైదరాబాద్ లో భూసేకరణ బాధితులు దీక్ష చేపట్టనున్నట్టు పలువురు నాయకులు వెల్లడించారు. భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు ఆశప్ప అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహారిస్తున్నదని విమర్శించారు. బలవంతపు భూసేకరణను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములను స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం కొందరిని ప్రలోభాలకుగురి చేస్తే, మరికొందరిని చిత్రహింసలకు గురి చేస్తున్నదని విమర్శించారు. హైకోర్టు తీర్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. భూ నిర్వాసితుల సమస్యల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ అడ్డగోలుగా జరుపుతున్న భూసేకరణ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీపీఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసి నాయకులు సంధ్య, భూ సేకరణ బాధితుల నేత సరస్వతి కవుల, రైతు సంఘం నాయకులు కన్నెగంటి రవి, తెలంగాణ రైతు సాధన సమితి నేత రాజన్న, టీజేఎస్ నాయకులు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు గోపకాని శంకర్ పల్లె వినరుతో పాటు వరంగల్ ఇన్నర్ రోడ్, టెక్స్ టైల్ జహీరాబాద్ నిమ్జ్, ఫార్మా బాధితులు హాజరయ్యారు.