Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుర్మార్గమైన ఈ విధానాన్ని రద్దు చేయాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముందుగా టోకెన్లు తీసుకుని, ఆ తర్వాతనే వరి కోతలు కోయాలనే దుర్మార్గమైన చర్యను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పంట నిర్ణీత కాలం ప్రకారం కోయకపోతే పంట దెబ్బతింటుందనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఈమేరకు ఆదివారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వరి మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులవుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. వరి కోత యంత్రాల కొరత ఉందనే సాకుతో టోకెన్ విధానాన్ని తీసుకరావడం సరైందికాదని పేర్కొన్నారు. దీంతో వరికోత ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. రైతాంగం రోజంతా టోకెన్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. కొన్ని చోట్ల తేమ శాతాన్ని ఎక్కువ చూపించి ధాన్యం కొనుగోలును నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదనీ, తెరిచినచోట కొనుగోలు జరగడం లేదని విమర్శించారు. ధాన్యంలో తేమ 17 శాతం ఉన్నా కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, కానీ అంతకు తక్కువ ఉన్న కూడా మిల్లర్లు కొనడం లేదని పేర్కొన్నారు. క్వింటాల్ సాధారణ రకానికి రూ1940, ఏ గ్రేడ్కు రూ 1960 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. దీని ప్రకారం ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.