Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతి సమానత్వం సాధించింది
- అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అక్టోబర్ విప్లవం ప్రపంచ చరిత్రనే తిరగరాసిందనీ సీపీఐ సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సభ్యులు డాక్టర్ యుగల్ రాయలు చెప్పారు. అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సందర్భంంగా హైదరాబాద్ మఖ్దూంభవన్లో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో యుగల్రాయలు ప్రసంగిస్తూ రష్యాలో అక్టోబర్ విప్లవం ద్వారా శాంతి, సమానత్వం, అందరికీ ఉపాధి, భూమి, ఆహారం, అక్షరాస్యత, ఆరోగ్యం వంటివి సాధించుకున్నారన్నారు. ఈ పరిణామం భూగోళమంతా ప్రభావాన్ని చూపిందని వివరించారు. సామ్రాజ్యవాద కాంక్షతో ముందుకుసాగుతున్న ఫాసిస్టు హిట్లర్ నేతత్వంలోని జర్మనీ సైన్యాన్ని ఓడించి, ప్రపంచ మానవాళిని కాపాడిన ఘనత అది సోవియెట్ యూనియన్ రెడ్ గార్డ్ సైన్యానిదేనని స్పష్టం చేశారు. అక్టోబర్ విప్లవ ప్రాముఖ్యత, ప్రపంచానికి అందించిన పాఠాలు, ప్రస్తుత భారతదేశ పరిస్థితుల్లో ప్రాంగికత గురించి వివరించారు. రష్యా విప్లవానికి 1847లో మార్క్స్ , ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో భూమిక అని, అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఉద్దేశించి రూపొందించిన మొట్టమొదటి డాక్యుమెంట్ అదేనన్నారు. దేశంలో మోడీ నేతృత్వంలో అధికారంలో ఉన్న బీజేేపీ ప్రభుత్వానికి.. నాటి హిట్లర్ ఫాసిస్టు పార్టీ నీడలున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. అందుకే వారికి కమ్యూనిస్టులంటే భయమని వివరించారు. 2024లో మోడీ ఓడిపోయి, వామపక్షాల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం కేంద్రంలో వస్తుందనే భయంతోనే ముఖేశ్ అంబానీ లండన్లో స్థిరపడేందుకు సిద్ధపడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర కార్యదర్శి చాడ మాట్లాడుతూ అక్టోబర్ విప్లవం ప్రపంచానికే వేగుచుక్క వంటిదనీ, మానవళి మనుగడలో మార్పునకు నాందీ పలికిందన్నారు. ఇప్పటికీ ప్రజల్లో కమ్యూనిస్టులు మాత్రమే అంతరాలు లేని సమాజం కోసం పాటుపడతారనే విశ్వాసం ఉందని చెప్పారు. కందిమళ్ళ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ రష్యాలో అక్టోబర్ విప్లవం వచ్చే నాటికే ప్రపంచంలో ఎక్కడా స్వాతంత్య్ర దేశాలు లేవనీ, ఆ వెలుగులోనే పోరాటం ద్వారా అనేక దేశాలు స్వాతంత్రాన్ని పొందాయని వివరించారు. సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, ఎన్.బాలమల్లేశ్, బాగం హేమంతరావు, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక నాయకుడు మాదాసి బాలయ్య జీవితంపై రచించిన 'మసి మెరుపు' పుస్తకాన్ని ఆవిష్కరించారు.