Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ డెస్క్
ప్రపంచానికి అక్టోబర్ మహావిప్లవం స్ఫూర్తినిచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రెంచ్ విప్లవం.. ప్రజల విప్లవకర ఆశలు, ఆకాంక్షలను రగిలించి, మొట్ట మొదటిసారిగా కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించడంలో 1917లో రష్యా విప్లవం (అక్టోబర్ విప్లవం) విజయవంతమైందని తెలిపారు. అనేకమంది దార్శనికులు, తత్వవేత్తలు.. దోపిడీ, అసమానతలు, అన్యాయాలు లేని సమాజం గురించి ఆలోచించే ప్రయత్నం చేశారన్నారు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ల భావజాలాన్ని అనుసరిస్తూ, లెనిన్ నాయకత్వంలో రష్యన్ ప్రజలు సోవియట్ రష్యాను ప్రపంచపటం పైకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. రష్యా విప్లవం కఠినతరమైన సైద్ధాంతిక పరిశీలనలు, సాహసోపేతమైన మార్క్సిస్టు భావాల ఆచరణాత్మక పునాదులపై నిర్మితమైందని చెప్పారు. పెట్టుబడిదారీ దోపిడీ కబంధ హస్తాలు, నిరంకుశ జార్జ్ పాలనను కూలదోసేందుకు చాలా నిజాయితీగా నాయకత్వాన్ని, సైద్ధాంతిక పొందికను లెనిన్ కార్మిక, కర్షక మైత్రికి అందించాడని వివరించారు. సోవియట్ యూనియన్ కూలిపోయినప్పటికీ, వందేండ్ల తర్వాత రష్యన్ విప్లవ అనుభవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ప్రేరణ, స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయనీ, ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో కుల వివక్ష, మత సమీకరణలు, లింగ బేధాలతో పాటు ద్రవ్యోల్బణం, ఆకలి, అసమానతలు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నామని తెలిపారు. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలు.. ప్రభుత్వ ఆస్తులను నెమ్మదిగా ధ్వంసం చేస్తున్నదని చెప్పారు. కొన్నేండ్లుగా.. ఆరెస్సెస్ ప్రచార యంత్రాంగం ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ, తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్న వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నదన్నారు. ఈ సంక్షోభంలో కూరుకుపోకుండా.. బీజేపీ, ఆరెస్సె స్లకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బీజేపీని ఓడిం చడం వామపక్షాల ముందున్న ప్రధాన తక్షణ కర్తవ్య మని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీర మల్లేశం, కార్యదర్శి వర్గ సభ్యులు జయరాజు, రాజయ్య, మాణిక్యం, రామ్ చందర్, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.