Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు లేఖ ఇచ్చి...నేడు పోరాటమంటే నమ్ముతారా?
- సీఎం కేసీఆర్పై రేవంత్ ప్రశ్నల వర్షం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు పేనుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. ఏడేండ్లుగా కేసీఆర్ మోడీకి గులాంగిరీ చేసి, ఇప్పుడు గగ్గోలు పెట్టడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. సాగు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తుంటే, మీరు మద్దతు ఇవ్వలేదా? అంటూ ఆదివారం నాడొక ప్రకటనలో ప్రశ్నించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనాలని అడగబోమంటూ తానే స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చారని విమర్శించారు. ఇంత ఘోరమైన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకునే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు. ఇప్పుడేమో కేంద్రంపై పోరాట చేస్తానంటూ బీరాలు పలకడమంటే, ఈ ప్రాంత రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. సాగు చట్టాలపై ఏడాదిగా రైతులు కొట్లాడుతుంటే...సీఎంగా ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. చలిలో వణుకుతూ, ఎండలో ఎండుతూ కొందరు రైతులు ప్రాణాలు కోల్పోతే, ఇదేం ఘోరమంటూ కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ఎందుకు చేయలేదని నిలదీశారు. నాడు రైతు చట్టాలకు మద్దతు పలికిన సీఎం ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలను ఆ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆదేశించిన విషయాన్ని మరచిపోయారా? అని ప్రశ్నించారు. పెట్రోలు ఉత్పత్తులపై రాష్ట్రం ఒక్క రూపాయి పెంచలేదనడం పచ్చి అబద్ధమనీ, నాలుగు రూపాయలు పెంచారని తెలిపారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు కేంద్రంపై మాట్లాడితే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.