Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిరుధాన్యాలతో మెరుగైన ఫలితాలు
- నిర్లక్ష్యంతో ఇతర సమస్యలు
- మహిళలకు ఇబ్బందులే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి ప్రభావం ప్రత్యక్షంగా లక్షల మంది పడితే పరోక్షంగా కోట్లాది మందిపై పడింది. కరోనా కట్టడి కోసం తీసుకున్న లాక్డౌన్ చర్యలు చిన్నారులు, మహిళలను ఆరోగ్య పరంగా కుంగదీశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బందులు పడకుండా అనేక చర్యలు తీసుకున్నామని ప్రకటించినా, మహిళలు, చిన్నారులు ఆరోగ్యపరంగా దెబ్బతిన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. సమయానికి భోజనం చేసినా అందులో అవసరమైన పౌష్టికాహారం లేకపోవటంతో వారు రక్తహీనత బారిన పడ్డారు. ముఖ్యంగా పేదవర్గాల్లో రక్తహీనత మునపటి కన్నా పెరిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనంలో వెల్లడైంది. ఇక్రిశాట్ సంస్థ చిరుధాన్యాలపై చేసిన సర్వే కూడా వారిలో పెరిగిన రక్తహీనత సమస్యను బయటపెట్టింది. మహమ్మారి సమయంలో పాఠశాలల మూసివేత కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం సరఫరా చేసే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు, రాగి లడ్డు లాంటివి దీర్ఘకాలం లభించకపోవటం కూడా ఈ పరిస్థితి కారణమని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య తాజా సర్వే ప్రకారం.....
15 నుంచి 19 ఏండ్ల బాలికల్లో రక్తహీనత సమస్య ఐదు శాతం పెరిగింది. అదే విధంగా 2015-16లో 60 శాతం మందికే ఉన్న ఈ సమస్యకాస్తా 2019-20 నాటికి 65 శాతానికి పెరిగింది. బాలికల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో 55.2 శాతం ఉండగా, గ్రామాల్లో ఎక్కువగా 58.9 శాతం మందిలో కనిపించింది. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో 2018లో 156 ప్రభుత్వ స్కూళ్లలో 16,238 మందిపై సర్వే నిర్వహించారు. అప్పటికే 21 శాతం మంది తీవ్రమైన రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా ఇక్రిశాట్ తాజాగా 21 రోజుల నుంచి నాలుగున్నరేండ్ల పాటు చిరుధాన్యాలను తీసుకున్న 1000 మంది చిన్నారులపై సర్వే నిర్వహించారు. ఇందులో వాటిని రెగ్యులర్గా తీసుకున్న వారిలో అవసరమైన మేరకు హిమోగ్లోబిన్తో పాటు రక్తంలోని ఇతర కంటెంట్లు సరిపడినంతగా ఉన్నాయని గుర్తించారు. వాటికి దూరంగా ఉన్న వారిలో రక్తహీనతతో పాటు ఇతర సమస్యలు వస్తున్నట్టు తేలింది.
చిరుధాన్యాలతో సమతుల్య ఆహారం...
సమయానికి భోజనం చేయటంతో పాటు పిల్లలకు చిరుధాన్యాలను తప్పనిసరిగా అలవాటు చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కేవలం అన్నం మాత్రమే కాకుండా అరికెలు, కొర్రలు, సామలు, సజ్జలు, రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు కలిగిన ఆహారం తీసుకున్న పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఉండటం లేదని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగం వచ్చాక ఆస్పత్రులకు పరుగులు తీయటం కన్నా ముందుగానే ఇలాంటివి అలవాటు చేసుకుంటే రక్తహీనత లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మహిళలు ముఖ్యంగా బాలికలు ఒకసారి రక్తహీనత బారిన పడితే దానితో పాటు ఐరన్, విటమిన్ కె, విటమిక్ ఇ తక్కువై ఇతర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.