Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయం సోషలిజమే : బివి రాఘవులు
- ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలి : హేమలత
- ప్రమాదంలో భారత రాజ్యాంగం : ప్రొఫెసర్ హరగోపాల్
- అన్నింటా వర్గపోరాటాలు చేయాలి : ప్రొఫెసర్ నాగేశ్వర్
- విద్యావైద్య రంగాలను ప్రభుత్వాలే నిర్వహించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- రెండు దశాబ్దాలైనా 33 శాతం రిజర్వేషన్ ఏది? : ప్రొఫెసర్ కస్తూరి లక్ష్మి
- జాతీయ కౌన్సిల్ సమావేశాలు, అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం నేపథ్యంలో సీఐటీయూ సెమినార్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెట్టుబడి దారీ వ్యవస్థ శాశ్వతం కాదనీ, ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, అక్టోబర్ విప్లవ వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో పలు అంశాలపై ఆన్లైన్ సెమినార్ను నిర్వహించారు. దీనికి సమన్వయకర్తగా జె.వెంకటేశ్, అధ్యక్షవర్గం గా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బుర్రి ప్రసాద్, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, రైతు సంఘం సహాయ కార్యదర్శి ఎం. శోభన్, వ్యవహ రించారు. ఈసందర్భంగా 'పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాలు- ప్రత్యామ్నాయాలు' అనే అంశంపై రాఘవులు మాట్లాడుతూ.. మానవ ఉనికి ప్రారంభం నుంచి పెట్టుబడిదారీ సమాజం ఉందనీ, మార్క్స్ చెప్పిన సోషలిజం రాదని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. రాజే దైవాంశసంభూతు డనే రాజరిక వ్యవస్థ 1000 నుంచి 1500 ఏండ్లు మాత్రమే ఉండి ఆ వ్యవస్థ కూలిపోయిందన్నారు. పెట్టుబడిదారీ సమాజం వచ్చి 400 ఏండ్లు కూడా కాలేదన్నారు. ఆ వ్యవస్థ కూడా శాశ్వతం కాదనీ, దాని అంతానికి అంతర్గత సంక్షోభాలే కారణమవుతాయని మార్క్స్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 1838, 1848లలో యూరప్ అంతటా రెండు సంక్షోభాలు వచ్చాయన్నారు. అప్పుడే అక్కడ విప్లవాలు మొదలయ్యాయ న్నారు. ఆనాడే మార్క్స్-ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక రచించి ''ప్రపంచ కార్మికులారా ఏకంకండి..తిరుగుబాటు చేస్తే పోయేదేమీలేదు బానిససంకెళ్లు'' అని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 1857, 1870 ప్రాంతాల్లో సంక్షోభాలు వచ్చా యని తెలిపారు. 1871 ప్యారిస్ కమ్యూన్ జరిగిందన్నారు. పెట్టుబడిదారీ సమాజంలోని సంక్షోభాల ఫలితంగా మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందన్నారు. సోవియట్ యూనియన్లో 1917లో కార్మికవర్గం అధికారంలోకి వచ్చిందన్నారు. 1929 -30లో మళ్లీ వచ్చిన సంక్షోభం వల్ల రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందన్నారు. వలస వ్యవస్థ కూలిపోయిందన్నారు. సోవియట్ ప్రభావంతో చాలా దేశాలు సోషలిజం వైపు అడుగులు వేశాయని గుర్తుచేశారు. రెండోప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ సమాజం తేరుకుని విస్తృత పరుచుకున్నదనీ, దాదాపు 50 ఏండ్ల పాటు పెట్టుబడిదారీ సమాజం స్వర్ణయుగమని ప్రచారం జరిగిందన్నారు. దీని ప్రభావానికి కార్మికవర్గం కూడా లోనైన పరిస్థితి తలెత్తిందనీ, ఆయిల్ సంక్షోభం తర్వాత ఆ సమాజంపై నమ్మకం సడలడం ప్రారంభమైందనీ, అయితే, 1989-90లో సోవియట్లో సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలితే.. ఆ వ్యవస్థ కూడా శాశ్వతం కాదని ప్రచారం చేశారన్నారు. 2008 సంక్షోభం తర్వాత నేడు పెట్టుబడిదారీ విధానం సంస్థాగత సంక్షోభంలోకి కూరుకుపోయిందనీ, నిరంతర సంక్షోభాలతో ఉన్న అది ప్రజల కష్టాలను తీర్చదనీ, నిరుద్యోగ సమస్య పోదనీ, అసమానతలు పెరుగుతాయని చెప్పారు. పెట్టుబడిదారీ విధానం విపత్తుల సమయంలోనూ లాభాల కోసమే పరుగులుపెడుతుందని కరోనా విపత్తును చూపెడుతూ వివరించారు. ఆ సమాజం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతికే ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. పెట్టుబడిదారీ సమాజం 400 ఏండ్లలో సాధించలేనిది.. సోవి యట్ యూనియన్ 70ఏండ్లలో యూఎస్సరసన చేరిందన్నారు. అభివృద్ధిలో చైనా అమెరికాను మించిపోతున్నదనీ, ఇది తట్టు కోలేని యూఎస్ఎ చైనాను ఒంటరిచేయాలనే కుట్రలకు పూను కుంటున్నదని చెప్పారు. అమెరికా ఎన్ని కుట్రలకు పాల్పడినా క్యూబా తట్టుకుని నిలబడిన తీరును వివరించారు. నేడు పెట్టుబడిసమాజాన్ని చాలెంజ్ చేసే ఉద్యమాలు ప్రపంచవ్యాప్తం గా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయమార్గం సోషలిజమేననీ, కార్మికవర్గాన్ని చైతన్యపరిచి ఆ దిశగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఐక్యపోరాటాలకు ప్లాట్ఫారమ్ రూపొందించాలి : సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ హేమలత
దేశవ్యాప్తంగా ఐక్యపోరాటాలను నిర్వహించేందుకు ప్లాట్ఫారమ్ రూపొందించాల్సిన బాధ్య త సీఐటీయూపై ఉందని ఆ యూని యన్ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ హేమలత అన్నారు. కార్మిక కర్షక ఐక్యత, ప్రతిఘటనా పోరాటాలు అనే అంశంపై ఆమె మాట్లాడుతూ..కోవిడ్ సమయం లో మనవైద్య వ్యవస్థఎంత బలహీనంగా ఉందో తేలిపోయిందన్నారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే చప్పట్లు కొట్టండి..ప్లేట్లు కొట్టండి..దీపాలు వెలిగించండి అంటూ ప్రధాని అశాస్త్రీయ చర్యలకు పూనుకోవడం దారుణమని విమర్శించారు. ప్రజలను అశాస్త్రీయ, మతం అం శాల చుట్టూ తిప్పుతూ కరోనా విపత్తు చాటున కార్పొరేట్లకు అను కూలమైన అన్ని చర్యలనూ మోడీ సర్కారు తీసుకుంటున్నదని తెలిపారు. కార్మికకోడ్లు, నూతన వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అని చెప్పారు. కోడ్ల ద్వారా కార్మిక పోరాట శక్తిని బలహీనపర్చాలనీ మోడీ చూస్తున్నారనీ, కానీ, కార్మికులు అణిచివేసే కొద్దీ తిరుగుబాటు తనం పెరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిఫెన్స్ రంగంలో ప్రయివేటీకరణ దేశభద్రతకే ప్రమాదమన్నారు. వలస కార్మికుల పట్ల కరోనా సమయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. ఆర్థిక పోరాటాలే కాకుండా సామాజిక అంశాలనూ తీసుకుని కార్మిక సంఘాలు పోరాటాలకు రూపకల్పన చేయాలని ఆకాంక్షించారు. ఐక్యపోరాటాలు మరింత బలపడేలా సీఐటీయూ కృషి చేయాలని నొక్కిచెప్పారు.
బీజేపీ మళ్లీ గెలిస్తే... రాజ్యాంగ స్వరూపానికే ప్రమాదం : ప్రొఫెసర్ హరగోపాల్
'భారత రాజ్యాంగం-పౌర హక్కుల మీద జరుగుతున్న దాడులు' అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..ఇప్పుడున్న బీజేపీ పాలకవర్గం 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే ఇప్పుడున్న రాజ్యాంగ స్వరూ పాన్ని మార్చివేసి దేశాన్ని నియంతృ త్వం వైపు తీసుకెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్టోబర్ విప్లవం మానవ చరిత్రలో కీలక మార్పు తీసుకొచ్చిన ఘట్టమని కొనియాడారు. మన దేశంలో స్వాతంత్రద్యోమంతో సంబంధం లేని ఒకవర్గం నేడు అధికారంలోకొచ్చి విలువలకు పాతరేస్తున్న దని విమర్శించారు. నాలుగైదేండ్ల కింద ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు గోవాలో మూడు రోజుల సదస్సు పెట్టుకుని భారతదేశా నికి ప్రాశ్చాత్య ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పనికిరావు కాబట్టి తిరస్కరిస్తున్నట్టు తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని అదే సమావేశం ఆమోదించిందని తెలిపారు. సంపద ఒకచోట పోగుకావడం ప్రమాదకరమని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. కార్పొరేట్లకు ఇది గిట్టడం లేదన్నారు. ఫలితంగానే పాలకులను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల కు అసలు హక్కులే లేకుండా చేస్తున్నారని ఆందోళన వెలిబు చ్చారు. ప్రశ్నించేవారిపై రాజ్యం దేశద్రోహ ముద్ర వేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు న్యాయవ్యవస్థలోని కొందరికి రాజకీయ ప్రయోజనాల ఆశచూపి లోబర్చుకుంటు న్నారని విమర్శించారు. తీవ్ర అణచివేతలోనూ తమ హక్కుల కోసం ఢిల్లీలో దేశ రైతాంగం చేస్తున్న పోరాటం ఆశాదీపంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందనాన్నరు. పోరాటాల విజయం సాధించ వచ్చుననే విశ్వాసాన్ని కార్మికుల్లో నింపాల్సిన బాధ్యత సీఐటీ యూపై ఉందన్నారు.
ఆర్థికం నుంచి ఆధ్యాత్మికం వరకు అన్నింటా వర్గపోరాటాలు చేయాలి : ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
'నయాఉదారవాదం..కార్మికవర్గం ముందున్న సవాళ్లు' అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ..ఆర్థిక విధానాల అమలు కోసం రాజ్యస్వభావం లోనే పాలకులు మార్పులు తెస్తున్నార న్నారు. రాజ్యం ఉదార స్వభావాన్ని, స్వీకరించే తత్వాన్ని కోల్పోయిందని విమ ర్శించారు. గతంలో ప్రజలు, కార్మికులు ధర్నాలు చేస్తే ప్రజాప్రతినిధులు, అధికా రులు వచ్చి సమస్యలను విని పరిష్కారి స్తామని హామీ ఇచ్చేవారని గుర్తుచేశారు. శాంతి భద్రతల పేరిట నిరసన తెలిపేహక్కును అడ్డుకోరాదని సుప్రీంకోర్టు చెప్పినా నేటి పాలకులు ధర్నాలకు అనుమతివ్వడం లేదన్నారు. మీడియా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్న తీరును పలు ఉదహరణలతో విడమర్చి చెప్పారు. పనిప్రదేశాల్లో హక్కుల కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాడే కార్మికులు తిరిగి ఇంటికెళ్లాక..తమ బతుకులు అలా తయారు కావడానికి కారణమైన రాజకీయ పార్టీలనే బలపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో రాజకీయ చైతన్యం కల్పించాల్సిన అవసరం కార్మిక సంఘాలపై ఉందని నొక్కి చెప్పారు. సంఘజీవి అయిన మనిషిని సాంకేతిక పరిజ్ఞానం వ్యక్తిగతం గురించే ఆలోంచించడం వైపు మరల్చుతున్న వైనాన్ని కండ్లకు కట్టినట్టు చూపెట్టారు. అందరికీ మంచే చేయాలి..అందర్నీ సమానంగా చూడాలనే మంచి అంశాలను పట్టుకుని ఆధ్యాత్మిక రంగంలోనూ వర్గ పోరాటాన్ని జొప్పించాలన్నారు. ఆర్థికం నుంచి ఆధ్యాత్మికం వరకు అన్ని రంగాల్లోనూ ఆలోచనల మధ్య సంఘర్షణ సృష్టించాలన్నారు.
విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వాలే నిర్వహించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
'విద్య, ఆరోగ్య రంగాలు- ప్రభుత్వాల పాత్ర' అనే అంశంపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ..విద్యా, వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వాలే నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూరప్ దేశాలలో, అమెరికాలో ఆరెండు వ్యవస్థలూ ప్రభుత్వ ఆధీనంలో నే ఉండగా మన దేశంలో మాత్రం ఎక్కు వగా ప్రయివేటు రంగం ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. వాటిని పూర్తిగా ప్రయివేటుపరం చేసే యత్నంలో కేం ద్రం ఉందన్నారు. బడ్జెట్లో కేటాయింపు లు లేకుండా అందరికీ విద్య ఎలా అం దుతుందని ప్రశ్నించారు. దేశ బడ్జెట్లో విద్యకు 3.1 నుంచి 2.6 శాతానికి నిధులు తగ్గించబడ్డాయని తెలిపారు. తమిళనాడులో 85 శాతం, కేరళలో 80 శాతం, ఢిల్లీలో 70 శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాల్లో చదువుతుంటే మన రాష్ట్రంలో మాత్రం అది 47 శాతమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా ఉన్నత విద్య చదువుకునే అవకాశం కేవలం 10 శాతమే ఉందన్నారు. హైదరాబాద్లో 45 లక్షల జనాభాకు 16 పీహెచ్సీలే ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఓ డాక్టర్, నర్సు, ఫార్మాసిస్టును పెడితే మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్పేరుతో కేంద్రం మభ్యపెడుతున్నదన్నారు. గ్రామాల్లో, బస్తీల్లో ఎక్కడికక్కడ విద్యా, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
రెండు దశాబ్దాలైనా 33 శాతం రిజర్వేషన్ ఏది? : ప్రొఫెసర్ కస్తూరి లక్ష్మి
మన దేశంలో పితృస్వామిక భావజాలం ఇంకా బలంగా ఉండటం వల్ల నేటికీ మహిళలు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారనీ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు రెండున్నర దశాబ్దాలు దాటినా ఆమోదం పొందలేదని ఓయూ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కస్తూరి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టే హక్కు కూడా ఆడబిడ్డ లేదన్నట్టుగా కొందరు గర్భంలోనే చిదిమేస్తున్నారని వాపోయారు. అన్నింటికీ కొడుకే అనే ధోరణి ప్రతి ఒక్కరూ విడనాడాలని కోరారు. కుటుంబంలో ఆడ, మడ అనే తేడా లేకుండా పిల్లలను పెంచాలని పిలుపునిచ్చారు. మన దేశంలో నూటికి 56 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వాపోయారు. ఆదివాసీ మహిళలకు వైద్యసౌకర్యాలు మృగ్యమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని చెప్పారు.