Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కుంభకోణాల పేరుతో నాటి యూపీఏ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గాంధీభవన్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విచారణ లేకుండా తప్పుడు కేసులు పెట్టి దుష్ప్రచారం చేశారని స్పష్టమైందని తెలిపారు. నాడు స్కామ్లంటూ మాట్లాడిన కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యారనీ, రాందేవ్ బాబా పారిశ్రామికవేత్తగా మారాడనీ, అన్నా హజారే నోరు విప్పడం మానేశారని విమర్శించారు. నల్లధనం వెలికి తీస్తామని పెద్ద నోట్లు రద్దు చేసి ఐదేండ్లైనా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. 16 లక్షల కోట్ల నోట్లను రద్దు చేస్తే ప్రస్తుతం 24 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయనీ, అదనంగా ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తనఖా పెట్టడం, లీజుకివ్వటం, అమ్మటం వంటి చర్యలు భవిష్యత్తులో దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలగజేస్తాయని ఆవేదన వ్యక్తం చేటశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా పెరిగినట్టు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదనీ, మూడు నెలల్లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో కేంద్రం రూ.1,92,259 కోట్లు రాబట్టుకుందనీ, ప్రస్తుతం ధరలు అతి తక్కువగా తగ్గించిందని తెలిపారు.
ప్రజలతో బీజేపీ, టీఆర్ఎస్ ఫుట్ బాల్: మల్లు భట్టివిక్రమార్క
ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''కేసీఆర్ అవినీతి నాకు తెలుసు. కేంద్ర హౌంశాఖ మంత్రి దగ్గర లెక్కలున్నాయంటూ '' బండి సంజరు పదే పదే అంటున్నారే కాని సీఎంను టచ్ కూడా చేయరని తెలిపారు. బండి సంజరు వన్నీ బడాయి మాటలేనని విమర్శించారు. రాజకీయ కోలాటంలో ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు. ''నువ్వు నన్ను తిట్టు....నేను నిన్ను తిడతా '' అంటూ కుమ్మక్కైన కేసీఆర్, బండి సంజరు ప్రజలను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రజల సమస్యలను గాలికొదిలేశారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ప్రభుత్వాలెందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పదమనీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అంచనాలకు, ఊహాలకు భిన్నంగా వచ్చిందనీ, దీనిపై పార్టీలో అంతర్మథనం చేసుకుంటామని చెప్పారు.