Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్ మరిన్ని ఐచ్చికాలు పెట్టాలనీ, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ క్యాబినెట్ సబ్కమిటీ చైర్మెన్ హరీశ్రావుకు ట్రెసా బృందం 13 ప్రధాన సమస్యలతో కూడిన వినతిని సోమవారం అందజేసింది. ధరణిలో పట్టాదార్ల క్రయ, విక్రయాలకు రిజిస్ట్రేషన్లు వెంటనే జరుగుతున్నాయనీ, రికార్డులో పేరు మార్పు జరిగి పట్టా పాసుబుక్కులు కూడా వెంటనే అందుతున్నాయని తెలిపారు. పెండింగ్లోని ఇతర అంశాలు, నిషేధిత జాబితా, విస్తీర్ణంలో వ్యత్యాసాలు, ఇండ్లు, ప్లాట్లుగా నమోదైన వ్యవసాయ భూముల వంటి మొదలగు సమస్యలు పరిష్కరించి రైతులకు, పట్టాదారులకు రైతుబంధు, రైతుబీమా అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని బృంద సభ్యులు కోరారు. ధరణిలో ఇంకా అవసరమైన ఆప్షన్స్ ఇచ్చి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలనీ, రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించి సకాలంలో భూసమస్యలు పరిష్కారం చేసేందుకు వీలుకల్పించాలని విన్నవించారు. 13 ప్రధాన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రెండు మూడు రోజుల్లో ధరణి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని ట్రెసా నాయకులకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, తదితరులు ఉన్నారు.