Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతుల నిరసన
- కాసాల కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన
నవతెలంగాణ- హత్నూర
యాసంగిలో వరి సాగుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని కాసాల వరి కొనుగోలు కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి గ్రామాలను సస్యశ్యామలం చేశామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వమే వరి వేస్తే ఉరి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి ఉపయోగం కోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్లు, నాయకుల కమీషన్ కోసమే ఈ ప్రాజెక్టు కట్టారా అని నిలదీశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెబుతుంటే రైతులు కూడా ప్రత్యామ్నాయ పార్టీల వైపు మొగ్గు చూపుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా యాసంగిలో వరి పంటకు అవకాశం కల్పించాలనీ, కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.