Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ముట్టడికి గిరిజనేతర పోడు రైతుల యత్నం
- జిల్లా నలుమూలల నుంచి భారీగా రాక
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు చెందిన గిరిజనేతర రైతులు పోడు భూముల హక్కు పత్రాల కోసం కదిలారు. సోమవారం రైతు సేవా సంఘం పేరుతో తమకు సైతం హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ నుంచి కలెక్టరేట్ మూడు కోట్ల సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మూడు కోట్ల సెంటర్లో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గిరిజనేతర రైతు సేవా సంఘం నాయకుడు ఎస్కే నబీ సాబ్ మాట్లాడారు. ఏజెన్సీలో గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం అనేక తరాలుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతరులు 90 ఏండ్లుగా పోడు సాగులో ఉన్నట్టు ఆధారాలు చూపాలని నిర్ధేశించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పోడు సాగులో ఉన్న గిరిజనేతరులకు సైతం హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎఫ్ఆర్సీల్లో గిరిజనేతరులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సంఘం నాయకులు చల్లా నారాయణరెడ్డి, దేశెట్టి శ్రీనివాస్రెడ్డి, సుంకరబోయిన మొగిలి, కొమ్మనబోయిన వేణు, బిట్ల శ్రీనివాస్, గజ్జి రామన్న, కొమురెల్లి, రమేష్, సుభాష్రెడ్డి, కర్ర జనార్ధన్రెడ్డి, ముసుకు వెంకన్న, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.