Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాలో కేసీఆర్ వ్యాపారాలు
- 62లక్షల వరి ఎక్కడ సాగైందో చూపిస్తవా?
- ప్రతి గింజా కొంటామన్న వారికి కేంద్రంతో పనేంటీ? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'పైసలు తీసుకెళ్లి చైనాలో పెట్టి ఆ దేశంతో ఒప్పందం చేసుకుంటవా? వ్యాపారాల కోసం చైనాను సమర్థిస్తవా? సీఎం అయి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నెంబర్వన్ దేశ ద్రోహి కేసీఆరే' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. జవాన్లకు, దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'టచ్ చేస్తే నువ్వేం చేస్తావ్ అంటున్నావా.. అడ్డగోలుగా మాట్లాడిన లాలూప్రసాద్యాదవ్, చౌతాలా లాంటి ఏమయ్యారో గుర్తుందా? టైం వచ్చినప్పుడు వారిలాగే నిన్నూ టచ్ చేస్తాం' అని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'నీవు నిపుణుడివి కదా. మరో నిపుణుడిని తీసుకుని రా..హెలికాప్టర్ ద్వారా చూపెడతా? డ్రోన్ల ద్వారా చూపెడతా? నీయిష్టం. 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగైందో చూపెట్టు' అని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఎఫ్సీఐ రాసిన లేఖలో కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తాం..మార్కెట్లను ఎత్తివేస్తాం అని ఎక్కడైనా ఉందా? చూపెడితే ముక్కు నేలకు రాస్తానన్నారు. రైతుల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కార్లు కొనుక్కుని రైతులు ఎక్కడ తిరుగుతున్నారో చూపెట్టాలని నిలదీశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. పూటకోమాట మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నది నీవు కాదా? అని అడిగారు. ప్రతి గింజా కొంటానన్న నీకు కేంద్రంతో పని ఏముందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు కొందరు మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపించారు. మందు తాగి బండి నడపటం తప్పయితే..మద్యం ఆదాయం ద్వారా ప్రభుత్వాన్ని నడపటం ఎందుకు తప్పు కాదో సీఎం చెప్పాలన్నారు. సచివాయలాన్ని కూల్చేసి గుప్త నిధుల కోసం వెతుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 570 టీఎంసీలు దక్కాల్సి ఉండగా 299 టీఎంసీలు మాత్రమే రావల్సి ఉందని సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుకూ సహకరించలేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అని రాష్ట్రాలు పట్టుకుని తిరిగినా ఎవ్వరూ దగ్గరకు రానివ్వలేదని చెప్పారు. కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధాని అయితే పాకిస్తానోడు ఓ ముక్క, చైనావాడు ఓ ముక్క, ఇటుపక్కనున్నోడు మరో ముక్క లాక్కుని పోతాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. తల నరుకుతవా? ప్రాణాలకు తెగించినోళ్లం. నిజంగా వస్తాం నరుకుతవా? అని సవాల్ విసిరారు. బీజేపీ ముమ్మాటికీ హిందూత్వ పార్టీనేననీ, ఎంఐఎంతో జతకట్టిన నువ్వు సెక్యూలరిస్టు ఎలా అవుతావు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేస్ట్ ఫెలో అని సెర్చ్ కొడితే వచ్చే మొదటి పేరు కేసీఆర్దేనన్నారు. ఏకానాపైసా వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పేది పచ్చి అబద్ధమన్నారు. అబద్ధాలకు ఓ శాఖను పెట్టారనీ, దానికి ప్రస్తుతం ఆయన అల్లుడు హరీశ్రావును మంత్రిగా పెట్టారని విమర్శించారు. 2015లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచిన జీవో కాపీలను చూపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వ్యాట్పై రూ.28, కేంద్రం నుంచి రూ.12 ఆదాయం పొందుతున్నదని వివరించారు. వ్యాట్పై అధిక ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వటం లేదనే దాంట్లో వాస్తవం లేదని కొట్టిపాడేశారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీలో చేర్చాలని ఎందుకు లేఖ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 24 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాక ఇక్కడ ఎందుకు తగ్గించటం లేదని నిలదీశారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..ఎన్నడైనా కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు.