Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయితే సరిహద్దు వివాదాలు.. లేదంటే మత విద్వేషాలు
- ఇదే బీజేపీ విధానం
- ఆ పార్టీ దగ్గర మూడు స్టాంపులు
- కమలం పార్టీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మిమ్మల్ని, మీ విధానాల్ని ప్రశ్నించి, నిలదీస్తే దేశద్రోహులా...?' అని సీఎం కేసీఆర్ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. అయితే సరిహద్దు వివాదాలు.. లేదంటే మత విద్వేషాలను రగిలించటం ద్వారా రాజకీయంగా లబ్ది పొందటమే ఆ పార్టీ విధానమని విమర్శించారు. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు పార్లమెంటులో మద్ధతిచ్చినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్టు చేసినప్పుడు టీఆర్ఎస్ దేశద్రోహి కాదు. ప్రజల పక్షాన మాట్లాడితే మాత్రం మా పార్టీ దేశద్రోహి. బీజేపీ ఏమైనా దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరియా? ఆ పార్టీ దగ్గర రెండు, మూడు రకాల స్టాంపులున్నాయి. ఇవే అర్బన్ నక్సలైట్లు, దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు. వారికి నచ్చకపోతే రాత్రికి రాత్రే ఏదో ఒక స్టాంపు వేసేస్తారు. బీజేపీ నియమించిన మణిపాల్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారు. వారు కూడా దేశద్రోహులేనా..? ఇలా ఎంత మందిని దేశద్రోహులంటారు. దేశం దురాక్రమణకు గురవుతున్నదనీ, దాన్ని కాపాడాలని కోరితే దేశద్రోహంటూ ముద్ర వేస్తారా..?' అని కేసీఆర్ ప్రశ్నించారు.సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... 'మేం రెండు సార్లు ప్రజా బలంతో అధికారంలోకి వచ్చాం. బీజేపీలాగా దొంగ లెక్కలతో రాలేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలు అధికారమివ్వకున్నా దొడ్డిదారిన, అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వాలను నడుపుతున్నది. ఇలాంటి వాటిని ప్రశ్నించటం తప్పా?. 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి 107 సీట్లలో డిపాజిట్ రాలేదు. ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్ రాలేదు. వాటి సంగతేంటి? బీజేపీ వాళ్లు చెప్పింది వింటే దేశభక్తులు, తప్పులు ఎత్తి చూపితే దేశద్రోహులా..? 10 రోజులు ఆగితే ఐటీ, ఈడీ రైడ్స్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. నా హద్దులు నాకు తెలుసు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే పెరిగిందంటూ బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నది. పెట్రోల్ ధరలు తగ్గించమని అడిగితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పొమ్మంటారా...' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అడ్రస్ లేని బండి సంజరు... ఆ ఉద్యమంలో తన పాత్ర ఏంటంటూ అడగటం పెద్ద జోక్ అని సీఎం విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం నిధులను వినియోగించామని నిరూపిస్తే... సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు...
రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలనిచ్చామని సీఎం తెలిపారు. మరో 80 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెప్పారు. బీజేపీలాగా గోల్మాల్ తిప్పుడు మాటలు మాట్లాడబోమన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పిన మోడీ సర్కార్... ఇప్పుడు సంవత్సరానికి కోటి ఉద్యోగాలను ఊడబెరికిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు దొంగ వ్యాపారాల్లేవు..
'దొంగలు మాత్రమే భయపడతారు. మేమెందుకు భయపడాలి. నాకు దొంగ వ్యాపారాలు లేవు. బీజేపీ మమ్మల్ని ఏమీ చేయలేదు. లేకుంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతానా? ఎవ్వరితోనైనా కొట్లాడుతా. అన్నింటికీ ఒకే మంత్రం పని చేయదు. ఒక్కోసారి ఎదురు దెబ్బ తగులుతుందన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఎక్కువగా ఖర్చు పెట్టే పార్టీ అదే. నేను తప్పు చేయను. ఎక్కడి వరకైనా పోరాడుతా. మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీడబ్ల్యూసీలో సభ్యునిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియాను చేర్చుకుని బీజేపీ కేంద్ర మంత్రిని చేసింది. అదే బీజేపీ ఇతర పార్టీల వారిని చేర్చుకుని మంత్రి పదవులిచ్చారంంటూ టీఆర్ఎస్ను విమర్శిస్తున్నది. అనుభవం ఉన్న వారిని చేర్చుకుని పదవులిస్తే తప్పేంటి...' అని సీఎం ప్రశ్నించారు.