Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు మృతి
- గాయపడిన వారిని పరామర్శించిన భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మారాయిగూడెంలోని లింగంపల్లి బేస్ క్యాంపులో సోమవారం తెల్లవారుజామున తోటి జవాను సహచర జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. మారాయిగూడెం బేస్ క్యాంపులో సోమవారం తెల్లవారుజామున రీతేష్ రంజన అనే జవాను తన తుపాకీతో సమీపంలో ఉన్న తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో దంజి, రాజీబ్ మండల్, రాజమణి కుమార్ యాదవ్ అనే ముగ్గురు జవాన్లు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ధనంజరు కుమార్ సింగ్, కేఆర్ ధర్మేంద్ర, ధర్మాత్మ కుమార్, బగ్ మలయా రంజని మహారాణా గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా వైద్యశాలకు హెలికాప్టర్లో తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో కేఆర్ ధర్మేంద్ర మృతిచెందాడు. బాధితులను వైద్యశాలలో భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ పరామర్శించారు. అత్యవసర చికిత్స అనంతరం జవాన్లను తిరిగి హెలికాప్టర్లో తిరిగి రాయపూర్ వైద్యశాలకు తరలించారు. మారాయిగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.