Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐఐ అవార్డుల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం భాసిల్లుతున్నదని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, పారిశ్రామికంగా స్వయం సమృద్ధితో పురోగమిస్తున్నామని చెప్పారు. సోమవారంనాడిక్కడి ఓ స్టార్ హౌటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) మ్యానెక్స్-2021 అవార్డుల కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకే పరిమితమైంది తప్ప, క్షేత్రస్థాయిలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) పరిశ్రమల చేయూతకు ఏమాత్రం అక్కరకు రాలేదన్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో పారిశ్రామికరంగం ఏమవుతుందో అని ఆందోళన చెందామనీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన పెట్టుబడులు కూడా ఇక్కడకే వచ్చాయని పలుకంపెనీల పేర్లను ఉదహరించారు. టీఎస్-ఐపాస్ అమల్లోకి వచ్చాక, రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. లాక్డౌన్ టైంలో ఆన్లైన్ సేవల్ని క్షేత్రస్థాయిలోని చిన్న కిరాణా దుకాణం వరకు తీసుకెళ్లగలిగామనీ, తద్వారా స్వయం ఉపాధి, వ్యాపారాలు నష్టపోకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకింగ్స్లో రాష్ట్ర జనాభాతో పోల్చితే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో పారిశ్రామికంగా తెలంగాణ 5 వ స్థానంలో ఉందన్నారు. ప్రజలు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాల నుంచి అందుతున్న సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయంటూ ఇటీవలి విదేశీ పర్యటన అంశాలను ప్రస్తావించారు. అధునాతన సాంకేతికతను ప్రజాజీవితంతో ముడిపెడితే వ్యాపారరంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఎమ్ఎస్ఎమ్ఈ విస్తరణ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదనీ, దానికోసం రాజధాని హైదరాబాద్తో చుట్టుపక్కల నగరాలను అనుసంధానం చేస్తూ, పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలు పారిశ్రామిక సంస్థలకు 'మ్యానెక్స్-2021' అవార్డులను అందచేశారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్, సీఐఐ తెలంగాణ రాష్ట్ర చైర్మెన్ సమీర్గోయల్, కన్వీనర్ శోభాదీక్షిత్, వైస్ చైర్మెన్ విగేష్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.