Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేరకున్నా ఇస్తామని పలు ఇంజినీరింగ్ కాలేజీల ఆఫర్
- ఎంసెట్ టాప్ ర్యాంకర్లకు యాజమాన్యాల వల
- కన్సల్టెన్సీలు, పాత విద్యార్థులతో సంప్రదింపులు
- సీట్లను రిజర్వు చేసుకుని యథేచ్ఛగా దోపిడీ
- మేనేజ్మెంట్ కోటాలోకి మార్చుకునేందుకు కుట్ర
- ఒక్కో సీటుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు వసూలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'హలో... మీరు ఎంసెట్ ర్యాంకరేనా. ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ జరుగుతున్నది. మీరు మా కాలేజీకి వెబ్ఆప్షన్ ఇవ్వండి. సీటు కేటాయించిన తర్వాత మీకు రూ.35 వేలు ఇస్తాం.'అంటూ ర్యాంకర్తో ఓ ప్రముఖ కాలేజీ పాత విద్యార్థి ఫోన్లో మాట్లాడారు. 'మీరు ఆమె ఫాదరా. మీ అమ్మాయికి జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు వచ్చింది. అయినా ఎంసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనండి. మా కాలేజీలో చేరకపోయినా ఫరవాలేదు. కానీ మా కాలేజీకి మాత్రం వెబ్ఆప్షన్ ఇవ్వాలి. అలా చేస్తే మీకు రూ.లక్ష ఇస్తాం?అని విద్యార్థిని తండ్రితో ఓ కాలేజీకి చెందిన పాత విద్యార్థి ఫోన్ ద్వారా సంభాషించారు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ ప్రవేశాల తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 9 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు గడువున్నది. 12న సీట్లు కేటాయిస్తారు. అయితే ఎంసెట్లో టాప్ ర్యాంకర్లే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్లోనూ ర్యాంకర్లుగా ఉంటారు. దీంతో వారు ఐఐటీలలో ప్రవేశం పొందుతారు.
దీన్ని అవకాశంగా తీసుకుని పలు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఎంసెట్ టాప్ ర్యాంకర్లకు వల వేస్తున్నాయి. తమ కాలేజీలో చేరకపోయినా వెబ్ఆప్షన్ ఇవ్వాలంటూ కన్సల్టెన్సీల ప్రతినిధులు, ఆ కాలేజీ పాత విద్యార్థులు సంప్రదిస్తున్నారు. నేరుగా అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బేరాలు మాట్లాడుతున్నారు. అన్ని కాలేజీలూ సీఎస్ఈ బ్రాంచ్కు మాత్రమే వెబ్ఆప్షన్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి. కాలేజీని బట్టి అభ్యర్థి ర్యాంకు ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కన్వీనర్ కోటాలో ఉన్న ఈ సీటును ఆ అభ్యర్థులకు కేటాయించిన తర్వాత అవి మిగిలిపోతాయి.
వాటి భర్తీ కోసం మరో కౌన్సెలింగ్ ఉండదు. దీంతో ఆ సీట్లను కన్వీనర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాలోకి మార్చుకోవచ్చు. ప్రస్తుతం సీఎస్ఈ బ్రాంచ్కు విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీన్ని కాలేజీ యాజమాన్యాలు 'క్యాష్' చేసుకునే పనిలో నిమగమయ్యాయి. అప్పుడు వాటిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డొనేషన్ కింద అమ్ముకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. కోట్లలో ఈ వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఎంసెట్ ర్యాంకర్లకు ఆయా యాజమాన్యాలు గాలం వేస్తున్నాయి.
ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అన్యాయం...
రాష్ట్రంలో ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ బ్రాంచ్లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీలే ఎంసెట్ ర్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకుని ఈ దందాకు పాల్పడుతున్నాయి. అయితే ఎంసెట్ ర్యాంకర్లకు, వారి తల్లిదండ్రులకు మాత్రం వెబ్ఆప్షన్లు ఇవ్వడం వల్ల జరిగే పరిణామాలపై అంతగా అవగాహన లేదని తెలుస్తున్నది. ఎందుకంటే వారి దృష్టి మొత్తం ఐఐటీల్లో ప్రవేశం పొందడంపైనే కేంద్రీకరిసా ్తరు. అందుకే ఇంజినీరింగ్ కాలేజీలు ఈ ర్యాంకర్లకు ఒకటికి పది సార్లు ఫోన్ చేసి వెబ్ఆప్షన్ ఇచ్చేలా ఒప్పిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కన్సల్టెన్సీలు, పాత విద్యార్థులను రంగంలోకి దింపి సంప్రదింపులు చేస్తున్నాయి. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిపుల్ఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 18న తుదివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని జోసా ప్రకటించింది. అది పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 20,21న వెబ్ఆప్షన్లు నమోదు చేయాలి. 24న సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 78,475 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దీనివల్ల ఎంసెట్లో ర్యాంకులు పొందిన ఇతర విద్యార్థులు నష్టపోయే ప్రమాదముంది. టాప్ ర్యాంకర్లతో వెబ్ఆప్షన్ ఇస్తే వారికే సీట్లు కేటాయించబడతాయి. ఎంసెట్లో ఎక్కువ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఆ కాలేజీల్లో వెబ్ఆప్షన్ ఇచ్చినా వారికి సీట్లు కేటాయించడం వీలుకాదు. దీంతో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా మంచి కాలేజీలో కన్వీనర్ కోటా ద్వారా సీట్లు పొందాలకున్న విద్యార్థులు నష్టపోతారు. ఇందులో ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఈ సామాజిక తరగతులకు చెందిన వారికే అన్యాయం జరుగుతున్నదని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీట్లు రిజర్వు చేసుకోకుండా, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు అన్యాయం జరగకుండా ఆయా కాలేజీ యాజమాన్యాలపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.