Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ
- ఎంఎస్ఆర్టీసీ నుంచి భారీ ఆర్డర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో అగ్రగామి విద్యుత్ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభాల్లో వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి దాని ఆదాయంలో 38 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ.69.05 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 50.19 కోట్లుగా నమోదైన విషయం విదితమే. రెండో త్రైమాసికంలో 18 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడంతో ఆదాయంలో వద్ధికి దోహదపడింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో కేవలం ఏడు బస్సులను మాత్రమే సరఫరా చేసిన సంగతి తెలిసిందే. కాగా, పూణేలో బస్సుల నిర్వహణ ద్వారా అధిక నిర్వహణ ఆదాయం సాధ్యపడిందని ఆ కంపెనీ తెలియజేసింది. ఎలక్ట్రిక్ బస్సుల డివిజన్ ఆదాయం రూ.17.8 కోట్ల నుంచి రూ. 42.1 కోట్లకు పెరిగింది. కాగా, ఇన్సూలేటర్ల డివిజన్ ఆదాయం మాత్రం 17 శాతం తగ్గి రూ.32.4 కోట్ల నుంచి 27 కోట్లకు పడిపోయింది. స్థూల లాభం రూ.3.4 కోట్ల నుంచి 5.7 కోట్లకు పెరగ్గా, నికరలాభం రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3.71 కోట్లకు చేరింది.
అత్యాధునిక విద్యుత్ వాహనాల ప్లాంట్ నిర్మాణం
విద్యుత్ వాహానాల తయారీ కోసం హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక ప్లాంట్ను ఒలెక్ట్రా గ్రీన్టెక్ నిర్మించనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐఐసిఎల్) నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్ మానవ ప్రమేయం అతితక్కువగా ఉండి, పూర్తి స్థాయిలో ఆటోమేషన్తోనూ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నారు. ఇందులో ప్రతియేటా 10,000 బస్సుల వరకు తయారు చేయవచ్చు. అలాగే ట్రక్కులు, త్రీ వీలర్స్, ఎల్సీవీలు, ఎంసీవీలనూ ఉత్పత్తి చేస్తారు. ఇది దేశంలోనే అత్యాధునిక ఆటోమోబైల్ తయారీ కేంద్రంగా ఉండనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది.
విద్యుత్ వాహనాల విప్లవం: మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్
ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఛైర్మెన్ మేనేజింగ్ డైరక్టర్ కె.వి ప్రదీప్ మాట్లాడుతూ విద్యుత్వాహానాల తయారీ విప్లవంలో భాగంగా వస్తున్న ఈ ఈవీ ప్లాంట్ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు భవిష్యత్ను మలుపు తిప్ప్పేదిగా ఉండబోతున్నది. దేశంలోనే అగ్రగామి విద్యుత్ వాహానాల కంపెనీగా ఎదగాలన్న లక్ష్యంతో ఓలెక్ట్రా పనిచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విధానాల్లో భాగంగా స్థానికంగా ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. దానికి తోడు రాష్ట్రంలో ఉపాథి అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఆర్థికాభివద్ధికి తోడ్పడుతుంది.
100 లగ్జరీ బస్సులకు ఆర్డర్
మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవి ట్రాన్స్ కన్సార్షియంలకు 100 లగ్జరీ ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ వచ్చింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డ్ను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మంగళవారం అందుకుంది. ఈ బస్సులు ముంబయి, పూణేల మధ్య నడవనున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇంటర్ సిటీ విద్యుత్ బస్సులు నడవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ. 250 కోట్లు. కాగా, ఈ బస్సులను వచ్చే పది నెలల్లోగా సరఫరా చేయనుంది. ఈ కొత్త ఆర్డర్తో ఒలెక్ట్రా ఆర్డర్ బుక్ దాదాపు 1550 బస్సులకు చేరుకున్నట్టు ఆ కంపెనీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.