Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ..
- ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ పండించిన వరి ధాన్యం లో 90శాతాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె చం ద్రశేఖర్రావు డిమాండ్ చేశారు. యాసంగిలో వరి ధాన్యం ఎంత శాతం కొంటారో ముందుగానే స్పష్టతనివ్వాలని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బుధవారం ఆయనలేఖ రాశారు.
ధాన్యం కొనుగోలుపై ఎఫ్సీఐకి ఆదేశాలివ్వండి.. 2020-21 రబీలో మిగిలిన ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. 2021-22 ఖరీఫ్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నీ కొనాలి. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలి. వచ్చే రబీలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలి. ఎఫ్సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొన్నది. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్సీఐ స్పష్టత ఇవ్వట్లేదు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదు.
వ్యవసాయ రంగంలో అద్భుతమైన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది.వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి రూ. 10,000 పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు.
ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేంది . నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, తెలంగాణ తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు .
ఎఫ్సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం
సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నది. ఎఫ్సీఐ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదు. ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు. ఎఫ్సీఐ అయోమయ విధానాల వల్ల సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది. ఉదాహరణకు.. 2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్సీఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది .
ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ను నేనే స్వయంగా వెళ్లి కలిశా. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని విజ్జప్తి చేశాను. కేంద్రమంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులైనా ఎలాంటి సమాచారం లేదు, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇప్పటికైనా చొరవ తీసుకొండి.