Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 144 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 35,659 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 31,153 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,506 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,178 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,694 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా 12 జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
11 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో బుధవారంతో పోలిస్తే గురువారం జీహెచ్ఎంసీతో సహా 11 జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
13 జిల్లాల్లో తగ్గిన కేసులు
ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.