Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5,242 కోట్లు..లెక్కెక్కడీ
- మరుగుదొడ్లు, స్నానాల గదుల్లేవ్
- అద్దె భవనాల్లో అవస్థలు
- సౌకర్యాలు లేకుండానే ఖర్చయినట్టు చూపుతున్న వైనం
- పట్టించుకోని ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మా హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుద్దో తెల్వదు. ఇందులో ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నాం.ఈ భవనం నుంచి మారాలని అనేక సార్లు అధికారులకు చెప్పాం. అయినా మా మొర పట్టించుకునే నాథుడే లేడు'.-కొత్తగూడెం జిల్లా అన్నపు రెడ్డి పల్లి హాస్టల్ విద్యార్థుల ఆవేదన. 'కరోనా నిబంధనలు ఏ మాత్రం ఇక్కడ అమలు కావటం లేదు. దీంతో కొందరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మేం భయం భయంగా గడుపుతున్నాం'.-వైరా గురుకుల విద్యార్థినుల ఆక్రందన 'వారం రోజులుగా హాస్టల్లో తాగు నీరు లేదు.ఇతర అవసరాలకూ నీరు లేదు.ఐదు రోజులుగా స్నానాలు కూడా చేయటం లేదు.కుళ్లిపోయిన కూరగాయలు, ముక్కిపోయిన బియ్యంతో వండిపెడుతున్నారు. కలుషితనీరు తాగటం వల్ల 19మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.ఇలాంటి పరిస్థితిలో మేం చదివేదెలా'? సరూర్నగర్లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ సోసైటీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన. 'రాష్ట్రంలో గురుకులాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నాం.' సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. వీటికి భిన్నమైన పరిస్థితి ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొంది. ఏడాదికి సుమారు 5,242 కోట్లు విద్యార్థులపై ఖర్చు చేస్తున్నారు. కానీ..ప్రభుత్వ లెక్కలు సత్యదూరమని క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది.
రాష్ట్రంలోని 969 గురుకులాల్లో మొత్తం 4,19,378 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే అవి సమస్యల కేంద్రాలుగా మారాయి. అద్దె భవనాలు, ఇరుకు గదులు. బాత్రూంల ఇక్కట్లు, మరుగుదొడ్ల కష్టాలు..మంచినీటి వేతలు, ఆరుబైట స్నానాలు, బోధకుల లేమితో నియమ బద్దంగా సాగని చదువులు.. వెరసి..గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా మూతబడిన గురకుల హాస్టళ్లలో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.
నాణ్యత లేని మెనూ..
నిత్యావసర ధరలు పెరిగినా ఇప్పటికీ ఏడేండ్ల కిందటి మెస్ ఛార్జీలే అమల్లో ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందటం లేదు.ధరలు 300శాతం పెరిగినా అందుకు తగ్గట్టుగా కేటాయింపులు లేకపోవటంతో మెనూ అమలు కావటం లేదు. నీళ్ల చారు, చప్పటి పప్పు, కుళ్లిన కూరలు, నీళ్ల సల్లతో విద్యార్దులు అర్థాకలితోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. వారానికి రెండు సార్లు మాంసాహారం పెట్టాల్సి ఉన్నా అన్నీ హాస్టల్స్లో సంపూర్ణంగా అమలు కావటం లేదు.
సమస్యలకు నిలయాలు..
పున:ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి అన్ని హాస్టళ్ళనూ అద్దంలా ఉంచాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా..క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లైట్ ఉంటే ఫ్యాన్ ఉండదు..నల్లా నుంచి నీరు రాదు..వచ్చినా శుభ్రంగా ఉండదు. ఆహ్లాదం కోసం కాసేపు గ్రౌండ్లో ఆడుకుందామని వెళ్తే మైదాన నిర్వాహణ ఉండదు. ప్రభుత్వ హాస్టళ్లలో 1్ణ40 ప్రకారం ఉపాధ్యాయులుండాలి. దీనికి మరో 1200 ఉపాధ్యాయ పోస్టులు అవసరం. కానీ.. ఇప్పటి వరకు ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదు. గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు.
వేదిస్తున్న అద్దెసమస్య..
సంక్షేమ గురకుల పాఠశాలలను వసతుల సమస్య వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లలో ఐదు వందలకు పైగా కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించగా అవి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడ కనీస వసతులూ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా విద్యార్థులు పెరుగుతున్నా సౌకర్యాలు పెంచకపోవడంతో పిల్లల నానా అవస్థలు పడుతున్నారు.
చన్నీళ్ల స్నానమే దిక్కు..
రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గురుకుల హాస్టళ్లలో ఉండే పిల్లలకు స్నానాలకూ వేడినీళ్లు అందుబాటులో లేవు. చలికి వణుకుతూ తెల్లవారుజామునే పిల్లలు చల్లటి నీటితోనే స్నానం చేస్తున్నారు. గదుల కిటీకీలకు రెక్కలు లేకపోవటంతో శీతల గాలులకు విద్యార్థులు అల్లాడిపోతున్నారు. జలుబు, దగ్గు, అలర్జీలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి రక్షణకు రగ్గులు, దుప్పట్లు అందించాలంటూ పలువురు విద్యార్ధులు కోరుతున్నాయి.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం..: తాళ్ల నాగరాజు,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలోని గురుకులాల్లో 90శాతం అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. సరైన సైకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్టీలు పెంచటం లేదు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. కోవిడ్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయటం లేదు. సర్కార్ మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. గోరంతలు చేసి గొప్పలు ప్రచారం చేసుకోవటం వల్ల విద్యార్థులకు జరిగే ప్రయోజనం ఏమీ లేదు. హాస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే సర్వేలు నిర్వహించాం. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం.