Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
''దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ స్వాతంత్య్రానికీ ప్రమాదం ఏర్పడింది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వ్యవసాయ నల్ల చట్టాల ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు.. ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే ప్రస్తుతం రద్దు చేశారు.. మళ్లీ తీసుకొచ్చే ప్రమాదముంది.. ఈ విధమైన కుట్రలను తిప్పికొట్టాలి'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్, ఎం.వెంకటేష్, కమిటీ సభ్యులు కె.నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 22వ మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రస్తుతం కమ్యూనిస్టులకు మంచిరోజులు వచ్చాయన్నారు. ''అమెరికా పెత్తనాన్ని కమ్యూనిస్టు చైనా దెబ్బ కొడుతోంది.. దేశరాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వ విధానాలకు కాలం చెల్లింది.. అందుకు నల్లచట్టాల రద్దే నిదర్శనం.. తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులు బీజేపీకి అవకాశంగా మారకుండా అడ్డుకోవాల్సింది ఎర్రజెండానే'' అని అన్నారు.
మొదట ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పోలికేక పెట్టింది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. దేశానికి రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే వచ్చిందని, ఆర్థిక, సామాజిక స్వాతంత్య్ర రాలేదని, ఈ విషయాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా చెప్పారని గుర్తుచేశారు. సామాజిక న్యాయానికి బీజేపీ సర్కార్ తూట్లు పొడుస్తోందని, కులాలవారీగా, ప్రాంతాలవారీగా అసమానతలు సృష్టిస్తూ అంటరానితనాన్ని పెంచిపోషిస్తోందని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనం చేస్తే.. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదం, నయా ఉదారవాదం కలిసిపోయాయని, అందులో భాగంగానే కార్పొరేట్ శక్తులకు రాయితీలు, వారికనుకూలంగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు. భూమిని, పంటలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి నల్లాచట్టాలను రూపొందించారని, రైతుల వీరోచిత పోరాటంతో చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. నగదీకరణ పేరుతో ఆస్తులతోపాటు సేవలను కోల్పోవాల్సి వస్తోందన్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి శాంతియుత పోరాటం రైతులదేనని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పోడు రైతులు, నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారని చెప్పారు.
రైతుల పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో ప్రజాసమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ.. సీపీఐ(ఎం)ను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్రావు, కేఎన్.రాజన్న, అరుణజ్యోతి, నగర మాజీ కార్యదర్శులు పీఎస్ఎన్ మూర్తి, రఘుపాల్ పాల్గొన్నారు.