Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సిద్ధం
- జాగ్రత్తలు పాటించాల్సిందే : డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొనేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దనీ, అదే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలనీ, మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందని చెప్పారు. ఇతర దేశాల్లో ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో ఆదివారం సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
''దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్కడా నమోదు కాలేదు. అది దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుగుతోంది. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. 14 రోజుల పాటు హౌమ్ క్వారైంటైన్లో ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 200 లోపే కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో 90 శాతం మందికి మొదటి డోసు, 45 శాతం మందికి రెండో డోసు ఇచ్చాం. వ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత ప్రజల్లో నిర్లిప్తత వచ్చింది'' అని డీహెచ్ పేర్కొన్నారు.
ఒమిక్రాన్ సంగతి తెలియాలంటే.. మరో రెండు వారాలు
ఒమిక్రాన్ ఏ మేరకు తీవ్రత, ప్రభావం చూపిస్తున్నదనే విషయం స్పష్టత కోసం మరో రెండు వారాలు పట్టొచ్చని ఆయన తెలిపారు. దీని విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. బూస్టర్ డోసు వేయాలా? వద్దా? అనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
విదేశాల నుంచి వచ్చే వారిలో....
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో, లేదో తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలను చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇందు కోసం జీన్ను గుర్తుపట్టే పరికరాలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.