Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019 నుంచి డీఏ బకాయిలు
- ఇప్పటికి ఇవ్వాల్సింది 23 శాతం
- 'ఇడ్లీస్' అటే...!
- ఆశాజీవులుగా టీఎస్ఆర్టీసీ కార్మికులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆదాయం పెంచడంలో ఆర్టీసీ కార్మికులు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. వారి కష్టానికి మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ దూకుడు కూడా తోడవడంతో ఆర్టీసీ బస్సు ఆదాయంలో వేగంగా దూసుకెళుతోంది. ప్రస్తుతం పెండ్లిండ్ల సీజన్ కావడంతో గతంలో కంటే రోజువారీ ఆదాయం రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు పెరిగింది. సజ్జనార్ ఎమ్డీగా వచ్చాక ఆర్టీసీ కార్మికులకు వారి జీతాలు వారికి ఒకటో తేదీకే రావడం మినహా, రావల్సిన పాత బకాయిలు ఏవీ ఇప్పటి వరకు చేతికందలేదు. 2015 తర్వాత వారికి ఫిట్మెంట్ కూడా ఇవ్వలేదు. రెండు ఫిట్మెంట్లు రావల్సి ఉంటే, యాజమాన్యం, ప్రభుత్వం వాటిపై కనీసం దృష్టికూడా పెట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులను మాత్రం పట్టించుకోలేదు. పైగా 2019 జులై నుంచి వారికి రావల్సిన కరువు భత్యం (డీఏ) కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఐదు డీఏలు బకాయి ఉన్నాయి. 2019 జులైలో 5.5 శాతం, 2020 జనవరిలో 5.4 శాతం, అదే ఏడాది జులైలో 4.7 శాతం, 2021 జనవరిలో 3.4 శాతం, అదే ఏడాది జులైలో 3 శాతం చొప్పున మొత్తంగా 23శాతం డీఏలు ఆర్టీసీ కార్మికులకు చెల్లిం చాల్సి ఉంది. సంస్థ ఆదాయం పెరిగిన నేపథ్యంలో కనీసం డీఏలు అయినా చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. రావల్సిన రెండు ఫిట్మెంట్ల ప్రస్తావనే ప్రస్తుతం లేదు. కార్మిక సంఘాలు అడపాదడపా అడుగుతున్నా, యాజమాన్యం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లోనే అంతర్భాగంగా ఉండే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం (ఇడ్లీస్) కూడా నిలిచిపోయింది. ఈ స్కీం కింద మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.2.50 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. డెత్ సర్టిఫికెట్ సమర్పించిన 48 గంటల్లో వారికి ఇన్సూరెన్స్ సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. 2019-20 నుంచి ఈ స్కీం అమలు కావట్లేదు. యాజమాన్యం పీఎఫ్ సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే దీనికి కారణం! దాదాపు 650 మంది ఆర్టీసీ కార్మికులు ఈ మధ్యకాలంలో మరణించారు. వారి కుటుంబసభ్యులు ఆ సొమ్ముకోసం చెప్పులరిగేలా డిపో మేనేజర్ల చుట్టూ తిరుగుతున్నారు. హెడ్ ఆఫీస్లో నిర్ణయం తీసుకోనిదే తామేమీ చేయలేమని డిపో మేనేజర్లు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు హైదరాబాద్ బస్భవన్కు వచ్చి ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా, ఇప్పటికీ మోక్షం లభించలేదు. ఇప్పటికైనా కార్మికులకు రావల్సిన బకాయిలు, చెల్లించాల్సిన ప్రయోజనాలు ఇస్తే, వారు మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారని కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు.