Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యంసేకరణలో కేంద్రానిది అస్పష్టవైఖరి
- సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ కోసం పార్లమెంట్లో గళం విప్పండి : టీఆర్ఎస్ -పార్లమెంటరీపార్టీ భేటీలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆహారధాన్యాల సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం తెలంగాణ రైతులతోపాటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపా డేందుకు కట్టుబడి ఉన్నామనీ, అందుకు పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని సీఎం పునరు ద్ఘాటించారు. రాష్ట్ర రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్దమైన, ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షత జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని వరిధాన్యం సేకరణలో స్పష్టతకోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్సభ సభ్యులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలనీ, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించేలా '' సమగ్ర జాతీయ ధాన్యంసేకరణ విధానం'' కోసం పార్లమెంటులో డిమాండ్ చేయాలని సీఎం కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె. కేశవరావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, కె.ఆర్. సురేష్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్, లోక్సభ ఎంపీలు బి.బి పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, గడ్డం రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యానికిగాను, కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామంటూ కేంద్రం మళ్లీ పాతపాటే పాడుతున్నదని చెప్పారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఇటు తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్గోయెల్ని, అటు సీఎస్తో కూడిన ఉన్నతాధికారుల బందం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినా, ఎటూ తేల్చక పోవడంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష సమావేశం తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది.
రానున్న యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో, తెలంగాణ రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో వచ్చే యాసంగిలో బాయిల్డ్రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంపై, అలాగే యాసంగి వరిధాన్యాన్ని ఎంత కొంటారో కూడా తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా, ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానంపై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉభయసభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరపున గళాన్ని వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. వార్షిక ధాన్యం సేకరణ క్యాలెండర్ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ను అభినందిస్తూనే, ఎటూ తేల్చని కేంద్రం వైఖరిపై సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానంపై పోరాడాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం దిగుబడిలో అనతికాలంలోనే తెలంగాణ రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది.