Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను నిండా ముంచుతున్న ప్రభుత్వాలు
- ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి
నవతెలంగాణ-కరీంనగర్ టౌన్
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయ మాటలతో రైతులను నిండా ముంచుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో కలిసి విలేకర్ల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే 20 రోజులైనా అధికారులు కొనుగోలు చేయడం లేదన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడటం సిగ్గు చేటన్నారు. ధాన్యం ఐకేపీ సెంటర్కు తెచ్చి, వర్షాలు పడితే కనీసం టార్పాలిన్ కవర్లు అందించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందన్నారు. ధాన్యం రోజూ ఆరబోస్తూ కుప్పల వద్ద రాత్రీపగలు కాపలా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మేచర్, తాలు పేరుతో దోపిడీ చేస్తున్నారని, ఒక్కో లోడ్కు 2 క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు తీస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారన్నారు. 24 గంటల విద్యుత్ అవసరం లేదని, రైతాంగానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం సక్రమంగా వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చాక రైతుల ప్రయోజనం కోసం మొదటి ప్రధాని నెహ్రూ ఎఫ్సీఐని ఏర్పాటు చేశారన్నారు. కానీ, ఇప్పుడు ధాన్యం కుప్పల మీదే రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 15లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పరిష్కరించకుంటే కరీంనగర్ వేదికగా వరి దీక్ష చేస్తామని అన్నారు. ఎంపీ బండి సంజరు ఏనాడూ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, చొప్పదండి కాంగ్రెస్ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, నాయకులు సమద్ నవాబ్, ఎండీ తాజ్, ఉప్పరి రవి, శ్రవణ్ నాయక్, అబ్దుల్ రహమాన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఏజ్రా, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.