Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలకు హైకోర్టు సలహా
- ఉత్వర్వుల జారీకి నిరాకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సలహా ఇచ్చింది. వరి కొనుగోలు అంశంపై దాఖలైన పిల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశించింది. రైతుల దగ్గర పండించిన వరి పంట నిల్వలు పేరుకుపోయాయనీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని లా స్టూడెంట్ శ్రీకర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ, వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అయినకాడికి కానికాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ఎంఎస్పి రూ.1,960 ఉంటే రూ.వెయ్యికే రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే వర్షాలు పడినా, ముంచుకురిసినా వరి ధాన్యం దెబ్బతింటుందన్నారు. తక్షణమే ప్రభుత్వం వరి ధాన్యం కొనేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుకుండా చేయాలని సూచించారు. ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం వద్ద ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. ఫలితంగా వరి ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 17న కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో జరిగిన సమావేశంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2021 నుంచి 2022 జనవరి మధ్యకాలంలో కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని వివరించారు. అయితే ఖరీఫ్లో పండిన వరి ధాన్యాన్నే కొనుగోలు చేయడం లేదని వాదించారు. రాత్రింబవళ్లు చమటోడ్చి పండించిన పంటలను కొనుగోలు చేసే నాధుడు లేకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఇప్పటికే పలు చోట్ల రైతుల పంటలు వర్షంపాలు అయ్యాయన్నారు.
ధాన్యం సేకరణ కేంద్రాల్లో నిల్వ చేసిన వరి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టిందన్నారు. ఆరు వేలకుపైగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది రైతుల నుంచి 28.5 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ చేయడమే కాకుండా మూడు వేల కోట్ల రూపాయల వరకూ చెల్లింపులు చేసిందని అన్నారు. మరో నెల రోజుల వరకూ కొనుగోళ్లు జరుగుతాయన్నారు. గుండెపోటు వల్ల ఇద్దరు రైతులు మరణిస్తే ధాన్యం సేకరణ చేయక చనిపోయారని చెప్పడం సరికాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలో చెప్పాలని పిటిషనర్ను కోరింది. రైతుల చట్టాల ఉద్యమంలో 700 మంది మరణిస్తే రూ.3 లక్షలు చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమని వ్యాఖ్యానించింది.