Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్ ఎదుట రైతుల బైటాయింపు
నవతెలంగాణ- లింగంపేట్
ధాన్యం విక్రయించగా రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బులను.. పంట రుణాల కింద బ్యాంక్ అధికారులు జమ చేసుకోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం చెమటోడ్చి ధాన్యం పండించగా వచ్చిన డబ్బుల కోసం వెళ్తే.. తమ ఖాతాలను బ్లాక్ చేస్తారా అంటూ బ్యాంక్ ఎదుట బైటాయించారు. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఎదుట జరిగింది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్లో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రైతుల ఖాతాలు ఉన్నాయి. ఇటీవల విక్రయించిన పంట డబ్బులు పడటంతో తీసుకునేందుకు బ్యాంక్కు వెళ్లారు. అయితే, పంట రుణాల బాకీ ఉన్న రైతుల ఖాతాలను బ్లాక్ చేసి ధాన్యం డబ్బులను బాకీ కింద జమ చేసినట్టు అసిస్టెంట్ మేనేజర్ శంకర్ తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు వాగ్వాదానికి దిగారు. అంతకుముందు రెవెన్యూ సిబ్బందిని పలువురు రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల ధాన్యం డబ్బులు బకాయి కింద జమ చేసుకోవద్దని సూచించినా బ్యాంక్ సిబ్బంది వినిపించుకోవడం లేదని వారు తెలిపారు. బ్యాంక్ గేటు మూసి రైతులు ఆందోళన చేశారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బంది రీజినల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండ్రోజుల్లో రైతులకు సమాధానం చెప్తామని బ్యాంక్ సిబ్బంది సూచించడంతో ఆందోళన విరమించారు.