Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా ముద్ర అగ్రికల్చర్ ఆఫీస్కు తాళం
- కోటి రూపాయలు టోకరా.. లబోదిబోమంటున్న బాధితులు
నవతెలంగాణ-గణపురం
ముద్ర లోన్లు ఇస్తామని, పొదుపుచేస్తే భారీ లాభాలు ఉంటాయని ప్రజలను నమ్మబలికి కోటి రూపాయలతో బోర్డు తిప్పేశారు. రెండు నెలలుగా ముద్ర అగ్రికల్చర్ ఆఫీస్కు తాళం వేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్( కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ) బోర్డు ఏర్పాటు చేశారు. దానికి బ్రాంచ్ మేనేజర్, తదితర సిబ్బందిని నియమించుకున్నారు. షాపు యజమానులు, రైతులు, మహిళలకు ముద్ర లోన్ ఇస్తామంటూ నమ్మబలికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ముద్ర లోన్లు ఇచ్చారు. వాటిని రోజువారీగా వసూలు చేసుకుంటూనే పొదుపు చేసుకోవాలని భారీ లాభాలు ఉంటాయని ప్రజలకు ఆశ కల్పించారు. దీంతో చాలామంది ప్రజలు వేలకు వేలు పొదుపు చేశారు. నగరంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు రూ.70వేలు, గణపురం గ్రామానికి చెందిన రాజేందర్ రూ.35వేలు, రవి రూ.70వేలు, అలాగే ఓ మహిళ రూ.2లక్షలు, మరో మహిళ రూ.70 -80 వేల వరకు పొదుపు చేసుకున్నారు. గణపురం మండలంలోనే కాకుండా వెంకటాపురం మండల ప్రజలు కూడా పొదుపు చేశారు. అయితే, రెండు నెలల నుండి ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి సదరు మేనేజర్కు ఫోన్ చేయగా మాయమాటలతో దాటవేశాడు. ముద్ర లోన్లు కూడా ఇవ్వడంతో నమ్మి డబ్బులు కట్టామని, కేంద్ర ప్రభుత్వం అనుబంధంతో సంస్థ నడుస్తుందని నమ్మించి మోసం చేశారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేసి ఆ సంస్థ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.