Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 825 కేజీలు....రూ.కోటి 65 లక్షలు
- గంజాయి అక్రమ తరలింపుదారులపై ఉక్కుపాదం :భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 825 కేజీలు గంజాయి విలువ సుమారు కోటి 65 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ స్పష్టం చేశారు. సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఎస్పీ వివరాలు తెలిపారు. సోమవారం ఉదయం చుంచుపల్లి ఎస్ఐ మహేష్, సిబ్బంది బృందావనం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎంహెచ్.09, హెచ్హెచ్-3684 నెంబర్ లారీని తనిఖీలు చేశారు. లారీలో 34 బ్యాగుల్లో 825 కేజీల గంజాయిని టైల్స్ కింద దాచిపెట్టి తరలిస్తున్నట్టు గుర్తించారు. లారీ డ్రైవర్ గ్వాలీయర్ పట్టణం, మధ్యప్రదేశ్కు చెందిన దినేష్గా గుర్తించారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దినేష్ తన స్నేహితుడైన సునీల్తో కలిసి గంజాయి వ్యాపారాన్ని చేద్దామని నిశ్చయించుకున్నాడు. వారి ప్రాంతంలో గంజాయిని సరఫరా చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే సునీల్ ఈనెల 4వ తేదీన లారీలో తూర్పు గోదావరి జిల్లా సమార్ల కోటకు వెళ్లి అక్కడ ఫ్యాక్టరీలో టైల్స్ కొనుగోలు చేశారు. అటువైపు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట అటవీ ప్రాంతం చేరుకుని గుర్తుతెలియని వ్యక్తుల వద్ద 34 బ్యాగుల్లో 825 కేజీల గంజాయిని తీసుకున్నారు. వాటిని టైల్స్ కింద అమర్చి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా మధ్యప్రదేశ్, గ్వాలియర్ తరలించాల్సి ఉండగా.. పోలీసులు పట్టుకున్నారు.
పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా రూ.కోటి 65 లక్షలు ఉంటుంది. ఇటీవల కాలంలో జిల్లా పోలీసులు భద్రాచలం, కొత్తగూడెం చుంచుపల్లి పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారని ఎస్పీ వారిని అభినందించారు. ఈ విలేకర్ల సమావేశంలో డిఎస్పీ జి.వెంకటేశ్వరబాబు, సిఐ గురుస్వామి, ఎస్ఐ మహేష్, ఏఎస్ఐలు సంజీవరావు, లక్ష్మీనారయణ, శ్యామ్, సునీల్, హిమ్లా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.