Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్... సిబీఐ కోర్టు విచారణకు రోజు హాజరు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం చెప్పారు. జగన్ సీఎంగా ఉన్న నేపథ్యంలో... ఆ విధమైన ఉత్తర్వులిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబీఐ వాదించింది. అయితే ప్రతిరోజూ సిబిఐ కోర్టు విచారణకు జగన్ హాజరైతే ప్రోటోకాల్ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని పిటిషనర్ వాదించారు. సిబిఐ కోర్టు విచారణకు హాజరుకావాలన్న ఉత్తర్వులను కొట్టేయాలని ఆయన కోరారు. అనంతరం న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.
కార్వీ కేసులో బెయిల్...
అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాల కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కంపెనీ సెక్రటరీ వై.శైలజకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత సోమవారం బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే విలువైన మరో రెండు పూచీకత్తులను సమర్పించాలంటూ ఆయన షరతు విధించారు.