Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసైన్డ్ భూములను ఆక్రమించారు
- 70.33 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న మెదక్ కలెక్టర్ హరీష్
- ఆరోపణల్లో నిజం లేదు : ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమునా హ్యాచరీస్ సంస్థ భూకబ్జా నిజమేనని మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట పరిధిలో 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూమిని జమూనా హ్యాచరీస్ ఆక్రమించిందని తెలిపారు. సోమవారం కలెక్టర్ హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. తమ భూములను జమునా హ్యాచరీస్ సంస్థ కబ్జా చేసిందని ఈ ఏడాది ఏప్రిల్లో కొంతమంది రైతులు ఫిర్యాదు చేశారన్నారు. భూ కబ్జా వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో ఆదేశించగా.. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి సర్వే చేశామని చెప్పారు. భూ కబ్జా నిజమేనని తేలిందన్నారు. తమ భూములను జమునా హ్యాచరీ స్ సంస్థ దౌర్జన్యంగా లాక్కు న్నదని 150 మందికి పైగా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.సర్వే నెం.81లో ఐదెకరాలు,సర్వే నెం.130లో మూడెకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్టు విచారణలో తేలిందన్నారు. అసైన్డ్ భూముల కబ్జాపై సెక్షన్ 3,4తో పాటు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు.ఫౌల్ట్రీ ఏర్పాటు చేస్తే పీసీబీ అనుమతి తప్పనిసరి అని..పీసీబీ ఈఈని ఈ విషయంపై అడగ్గా.. తమను సంప్రదించలేదని తెలిపారన్నారు.జమునా హ్యాచరీస్ యజమానులైన జమున, నితిన్ రెడ్డి భూమిని కబ్జా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ చేశారని హరీష్ తెలిపారు. అసైన్డ్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారని, ఎలాంటి పర్మిషన్లు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారని అన్నారు. ప్రోహిబిటేడ్ లిస్ట్లో ఉన్న భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఫారెస్ట్ ఏరియాలో రోడ్లు వేశారని,చెట్లు నరికారని వివరించారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పౌల్ట్రీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.కోళ్ల వ్యర్థాలు హల్దీవాగు లోకి వదలడంతో నీరు కలుషితమైందని తెలిపారు. అచ్చంపేట, హకీమ్పేటలో అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలుపై ప్రభుత్వానికి నివేదిక పంపామని, అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, సహకరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. తూప్రాన్ ఆర్డీవో, ఇన్స్పెక్టర్ ఆఫ్ డిప్యూటీ సర్వేయర్ ఆధ్వర్యంలో జమునా హ్యాచరీస్ భూ కబ్జాపై సర్వే చేశారు. ఎస్సీ, ముదిరాజ్, వంజర తదితర సామాజిక తరగతులకు చెందిన అసైన్డ్, సీలింగ్ భూములు అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నట్టు విచారణలో తేలిందని చెప్పారు.
ఒక్క ఎకరా కబ్జా చేయలే..
జమున హ్యాచరీస్ సంస్థ అసైన్డ్ భూములను ఆక్రమించిందని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఒక్క ఎకరా భూమి అక్రమం గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు నిరూపించినా ముక్కు నేలకు రాస్తాననినా భార్య మీడియా ముఖంగానే తెలియజేశారు. అనవసరంగా మాపై సీఎం కేసీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మేమే ఇంత కబ్జా చేశామంటున్న సీఎం కేసీఆర్.. తాను ఎంత భూమిని కబ్జా చేశారో చెప్పాలి.
- ఎమ్మెల్యే ఈటల రాజేందర్