Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీనోమ్ సీక్వెన్సింగ్ లో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విదేశాల నుంచి వచ్చిన 13 మంది అనుమానితుల రిపోర్టులను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. రిస్క్ దేశాల నుంచి ఇప్పటి వరకు 1805 మంది రాగా వారిలో 13 మంది కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి సోకిన వేరియంట్ ను తెలుసుకునేందుకు నమూనాల జన్యు క్రమాన్ని పరిశీలించారు. అయితే వీరెవరిలో ఒమిక్రాన్ లేదని వెల్లడి కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం మరో 535 మంది విదేశాల నుంచి రాగా వారికి చేసిన కరోనా పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ వచ్చింది.
195 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 195 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు37,108 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్ స్టేటస్ బులెటిన్ వెల్లడించింది. మరో 1,720 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,810 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 78 మందికి కరోనా సోకింది.
19 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం జీహెచ్ఎంసీతో సహా 19 జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
ఆరు జిల్లాల్లో తగ్గిన కేసులు
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిర్మల్ , నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో తగ్గాయి. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదు.
పెరిగిన వ్యాక్సినేషన్
ఒమిక్రాన్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. సోమవారం 4,30,782 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇందులో 2,36,383 మంది మొదటి డోసు తీసుకోగా, 1,94,399 మంది రెండో డోసు తీసుకున్నారు.