Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ బిల్లు రద్దయ్యే వరకూ పోరాటాలు
- ప్రజా పోరాటాల ద్వారానే పార్టీకి పూర్వ వైభవం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎంతటి నిరంకుశ పాలకుడైనా ప్రజాపోరాటాలకు దిగిరావాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏడాది కాలం గా సాగిన రైతాంగ ఉద్యమంతో ప్రధాని దిగొచ్చి రైతు వ్యతిరేక వ్యవ సాయ చట్టాలను రద్దు చేస్తూ.. క్షమాపణ చెప్పడమే అందుకు ఉదాహ రణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు రద్దయ్యే వరకు పోరాటం సాగుతుందన్నారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభ సోమవారం భూదాన్ పోచంపల్లిలో అట్టహాసంగాప్రారంభమైంది. ప్రారంభసభలో తమ్మినేని మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పని చేస్తే పార్టీని ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం వల్లే పార్టీకి పూర్వవైభవం వస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందే వరకూ, విద్యుత్ బిల్లు చట్టాన్ని రద్దు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రకటించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా విక్రయిస్తోందన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు మోడీ కుట్ర పన్నారని విమర్శించారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. విద్యా, వైద్య రంగాలను పూర్తిగా మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆయన కన్ను వ్యవసాయ రంగంపై పడిందన్నారు. సీఎం కేసీఆర్ మొదటి నుండీ వ్యవసాయ నల్ల చట్టాలకు అనుకూలంగా ఉన్నారన్నారు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోవడాన్ని చూసి అర్థం చేసుకోవాలన్నారు. మోడీతో తాడో పేడో తేల్చుకుని వస్తానని హడావుడిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఎందుకు కలిసి మాట్లాడలేదో చెప్పాలన్నారు. తాన అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వం తనపై ఎక్కడ దాడి చేస్తుందోననే భయం కేసీఆర్కు పట్టుకుందని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటాలు అభినందనీయమని చెప్పారు. అంతకు ముందు సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, పైళ్ల ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.