Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియార్టీ, స్థానికత ఆధారంగా కేటాయింపులు
- జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీల నియామకం
- ఎన్నికల కోడ్లేని జిల్లాల్లో వెంటనే ప్రక్రియ ప్రారంభం
- ఎంప్లాయీస్కు ఆప్షన్ సదుపాయం
- విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూ స్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు మార్గం సుగమమైంది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ విభజన ప్రక్రియ జరగనుంది. సీనియార్టీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజనను చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) విధివిధానాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జీవోనెంబర్ 317ను సోమవారం విడుదల చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఉంటుందనీ, ఇందులో ఆయా శాఖల జిల్లా అధిపతులు సభ్యులుగా ఉంటారని ప్రకటించారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించామని పేర్కొన్నారు. ఈ కమిటీలో ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, ఆర్థిక శాఖ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు (ఆప్షన్) తీసుకోనున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరగనుందని తెలిపారు. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికిపైగా వికలాంగులున్న ఉద్యోగులు, పిల్లల్లో మానసిక వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ మొదలుకానుందని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అనంతరం చేపడతామని వివరించారు. విభజన, కేటాయింపుల్లో ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలు రెండు చొప్పున పాత జిల్లాల నుంచి ఏర్పడ్డాయని తెలిపారు. జోనల్, మల్టీజోనల్కు సంబంధించి ఈ తరహా అంశాలున్నాయని పేర్కొన్నారు. దీంతో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీలకు సంబంధించి స్పష్టతనిచ్చి అనుబంధాలను వెలువరించామని వివరించారు. ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు. కానీ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ సమావేశాలకు టీజీవో, టీఎన్జీవో ప్రతినిధులను ఆహ్వానిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని అన్ని శాఖల నుంచి మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. వాటి ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకు, 5 శాతం స్థానిక, స్థానికేతరులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసిన విషయం విదితమే.
స్థానికత ప్రస్తావన లేని ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు : టీఎస్యూటీఎఫ్
సీనియార్టీతోపాటు స్థానికత, ఖాళీల దామాషానూ పరిగణనలోకి తీసుకుని నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317లో స్థానిక క్యాడర్లలో ఉద్యోగుల కేటాయింపునకు సీనియార్టీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుందని తెలిపారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే జిల్లాల కేటాయింపు తర్వాత వారిని వేర్వేరు జిల్లాలకు కేటాయిస్తే, అలాంటి వారు దరఖాస్తు చేసుకుంటే ఖాళీల లభ్యతను బట్టి మార్పు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. నూతన జిల్లాల్లో ఉద్యోగుల సమతుల్యత పాటించడంపై నిర్దిష్టమైన సూచనలివ్వలేదని తెలిపారు. ఖాళీల సంఖ్య ఏవిధంగా ఉండబోతుందో స్పష్టత లేదని వివరించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లలో సీనియార్టీ ప్రకారం ఉద్యోగులు కోరుకున్న జిల్లాకు కేటాయిస్తే ఖాళీల్లో అసమతుల్యత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పదోన్నతులు, నియామకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. క్యాడర్ విభజనలో మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలను దామాషా పద్ధతి పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికీ గుర్తింపు ఇవ్వలేదని పేర్కొన్నారు. టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్రతినిధులనే జిల్లా కమిటీ సమావేశాలకు ఆహ్వానించాలనడం సమంజసం కాదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులనూ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు సోమవారం వారు లేఖ రాశారు.