Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదుల కుట్ర.. ఆర్ఎస్ఎస్, బీజేపీ అమలు
- కేవీపీఎస్ సదస్సులో ఓయూ ప్రొఫెసర్ ఖాసీం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్పై హిందూ సంస్కర్త ముద్ర వేసేందుకు మనువాదులు కుట్రలు చేస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. ప్రశ్నించిన నిమ్న కులాల వ్యక్తులకు దేవుడి హౌదా కల్పించి, వారిలో కలిపేసుకోవడం మనువాదుల సహజ లక్షణమని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దీన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. ప్రశ్నించిన చండాలుడికి ఆది శంకారాచార్య దైవత్వాన్ని ఆపాదించారనీ, అవే ప్రశ్నలు సంధించిన బుద్ధుడిని దశావతారాల్లో కలిపేసుకున్నారని ఉదహరించారు. త్వరలో అంబేద్కర్ను కూడా అదే బాటలో కట్టేసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషించారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యాన సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్హాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్థంతి సందర్భంగా 'అంబేద్కర్ ఆశయాలు-నేటితరం కర్తవ్యాలు' అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికాయన ప్రధాన వక్తగా హాజరై, ప్రసంగించారు. అంబేద్కర్ భావజాల బలాన్ని మనువాదులు గుర్తించారనీ, అందుకే గోవల్కర్ ఫోటో పక్కనే అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణిజంపై పోరాడిన అంబేద్కర్ పోరాడారనీ, ఆయన జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించారని అన్నారు. అంబేద్కర్ పునరుత్థానంపై జరుగుతున్న చర్చలో సామాజిక వాస్తవాన్ని గుర్తించాలనీ, ఆయన ఆలోచనా దృక్పధాన్ని పరిశీలిస్తూ, పరిశోధనా పోరాటాలు జరగాలని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ అంబేద్కర్ను కొలిచే పద్ధతుల్లో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఆయన విగ్రహాలను పెట్టి ఆర్భాటాలు చేస్తే సరిపోదనీ, గ్రామగ్రామాన అంబేద్కర్ సాహిత్య కేంద్రాలు ఏర్పాటు ద్వారా, ఆయన భావజాల వ్యాప్తిని పెంచాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని ప్రచారం చేస్తున్నాయనీ, దీని వెనుక బ్రాహ్మణ మనువాద భావజాల ఉద్దేశ్యాలు సుస్పష్టంగా అర్థమవుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగం బహుజనుల గుండెచప్పుడు అనీ, దాని జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదనీ, అది ఆయన జీవిత ప్రస్థానంలో ఒక భాగం మాత్రమేనని వివరించారు. దానికంటే ఎక్కువగా సమానత్వం కోసం ఆయన అనేక పోరాటాలు చేశారని ఉదహరించారు. కమ్యూనిస్టులకంటే ఓ అడుగు ముందుకేసి భూమి జాతీయకరణ జరగాలని ఆయన డిమాండ్ చేశారని చెప్పారు. కేవీపీఎస్ ఉపాధ్యక్షులు ఎమ్ దశరథ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగ మూలసూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. మతోన్మాదం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే ఆంబేద్కర్కు అర్పించాల్సిన నివాళి అని స్పష్టంచేశారు. కార్యక్రమానికి కేవీపీఎస్ హైదరాబాద్ సిటీ కమిటీ అధ్యక్షులు బీ సుబ్బారావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి కే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.