Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ మున్సిపల్ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ కార్మికుల దుస్థితి
- జాబ్ కోసం ఏజెన్సీలకు లక్షలు చెల్లింపు
- ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
జాబ్ కోసం ఏజెన్సీలకు లక్షలు కట్టారు.. వేతనం వస్తే కుటుంబాలు బాగు చేసుకుందామనుకున్నారు.. అందుకోసం అప్పులు చేశారు. తల్లి, భార్యకున్న కొద్దిపాటి బంగారం కుదవ పెట్టారు. జాబ్ వచ్చిన సంబురం మూడు నెలలు కూడా నిలవలేదు. మూడు నెలలుగా వేతనాలు లేవు. తీవ్రమైన పనిభారం. ఇదేంటి సారూ.. అంటే ఉద్యోగం నుంచి ఊడపీకుతాం అని సమాధానంతో భయాందోళన.. ఇదీ నిజామాబాద్ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల దుస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కాలంలో శానిటైజేషన్ విభాగంలో 330 మంది కార్మికులను, 60 మంది డ్రైవర్లను ఔట్సోర్సింగ్ కింద తీసుకున్నారు. ఏజెన్సీ ద్వారా జరిపిన ఈ నియామకంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఒక్కో కార్మికుడి(లేబర్ పోస్టుకు) నుంచి రూ.1,20,000, డ్రైవర్ నుంచి రూ.1,50,000 వసూలు చేశారని సమాచారం. 'కార్పొరేషన్లో ఉద్యోగం.. ఎప్పటికైనా పర్మినెంట్ అయితది' అన్న నమ్మకంతో చాలా మంది నిరుపేదలు అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించారు. ఒకరు బంగారం కుదవపెడితే.. మరొకరు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. మూడు నుంచి నాలుగు శాతం చొప్పున వడ్డీకి సైతం అప్పులు చేశారు. ఇంత చేసినా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు నెలలుగా 390 మంది కార్మికులకు వేతనాలు అందడం లేదు. పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాల్సిన సర్కారు.. వేతనాల చెల్లింపే ఆపేసింది. ఫలితంగా కార్మికులకు కుటుంబ నిర్వహణతోపాటు వడ్డీ అదనపు భారమైంది. మూడు నెలల కుటుంబ నిర్వహణ, వడ్డీల కోసం ఒక్కొక్కరు అదనంగా మరో రూ.20-30 వేల అప్పు చేశామని కార్మికులు 'నవతెలంగాణ'తో వాపోయారు. వేతనాలు ఇవ్వకపోవడంపై ప్రశ్నించగా.. పై నుంచి రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
తీవ్ర పనిభారం..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 60 డివిజన్లు ఉన్నాయి. రెండు డివిజన్లకు కలిపి ఒక్కో ట్రాక్టర్ కేటాయించారు. ఆయా డివిజన్లలో చెత్తను డంప్ యార్డ్కు తరలించాలి. గతంలో ట్రాక్టర్కు ఒక డ్రైవర్, ఐదుగురు లేబర్ను కేటాయించారు. ప్రస్తుతం ఆ సంఖ్యను ముగ్గురికి తగ్గించారు. డివిజన్ల పునర్విభజన తరువాత కాలనీల సంఖ్య పెరిగి పని పెరిగింది. ఈ సమయంలో అదనంగా కార్మికులను కేటాయించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా సంఖ్యను తగ్గించి అదనపు భారం మోపుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వడం లేదు. గ్లౌజులు, మున్సిపల్ దుస్తులు ఇవేవీ కార్పొరేషన్ నుంచి అందడం లేదు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి. కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికులందరూ నిరుపేదలు. వేతనాలు నిలిపేయడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ నిర్వహణ కష్టతరమవుతోంది. వెంటనే వేతనాలు చెల్లించాలి.
- మల్యాల గోవర్ధన్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శిa