Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం దాటించేందుకు ప్రయత్నించిన ముఠా
నవతెలంగాణ-శంషాబాద్
నకిలీ వీసాలు, ధ్రువపత్రాలతో గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలను ఇచ్చారు. వీరందరికీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి టికెట్లు బుక్ చేశారు. ఈ క్రమంలో విమానాశ్రయం చేరుకున్న మహిళల వీసాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అవన్నీ నకిలీవని తేల్చారు. వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను ప్రశ్నించడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే దేశానికి రెండు వీసాలతో మహిళలు బయలుదేరారు. విజిటింగ్ వీసా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ వద్ద చూపించి, ఎంప్లాయిమెంట్ వీసా కువైట్లో చూపించాలని దళారులు మహిళలకు చెప్పారు. వీసా, ధ్రువపత్రాలు పరిశీలించే సమయంలో ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ముంబయిలో ఉన్న ప్రధాన ఏజెంట్ వీరిని దేశం దాటిస్తున్నట్టు సమాచారం. ఏపీలో మరో ఇద్దరు సబ్ ఏజెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఏజెంట్లపై 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 6 నెలల కిందట ఇదే ఏజెంట్ ముఠా 20 మంది మహిళలను దేశం దాటిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కువైట్లో ఉన్న ట్రావెల్ ఏజెంట్లతో ముంబయికి చెందిన ప్రధాన ఏజెంట్ కుమ్మక్కైనట్టు గుర్తించాం అని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.