Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా అడ్డుకట్టలో ఏజెన్సీలు కీలకంగా ఉండాలి
- వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అడిషన్ డైరెక్టర్ తిలోత్తమ వర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాల మధ్య సమన్వయం, నిఘావర్గాల బలోపేతం, ఏజెన్సీల కృషితోనే వన్యప్రాణుల సంరక్షణను సమగ్రంగా అమలు చేయగలుగుతామనీ, వేట, అక్రమ రవాణాను అడ్డుకోగలుగుతామని వైల్డ్ లైఫ్ క్రైమ్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ తిలోత్తమ వర్మ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ఏజెన్సీల మధ్య సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అటవీ, పోలీస్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, రైల్వేస్, సీఐఎస్ఎఫ్, ఫోరెన్సిక్, సీసీఎంబీ, జులాజికల్ సర్వే, బ్యూరో ఆఫ్ స్టాండర్స్, పోస్టల్ తదితర జాతీయ స్థాయి ఏజెన్సీల అధికారులతో వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, అడ్డుకట్ట కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ స్థాయిలో అటవీ జంతువుల వేట, స్మగ్లింగ్ జరుగుతున్న విధానాలు, మార్గాలపై తిలోత్తమ వర్మ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణులు, వాటి శరీర భాగాలకు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండే వాటి వేటకు, స్మగ్లింగ్కు కారణమవుతున్నదని చెప్పారు. శాస్త్రీయత లేని నమ్మకాలతో, విచక్షణారహితంగా జరుగుతున్న వేట వల్ల అరుదైన జంతువులు అంతరించే దశకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించటం ద్వారా అటవీ నేరాలను అదుపులో పెట్టొచ్చని సూచించారు. జంతువుల వేట, రవాణా నివారణపై వివిధ ఏజెన్సీల సెక్యూరిటీ, చెకింగ్ సిబ్బందికి అవగాహన పెంచాలని ఆదేశించారు. తెలంగాణలో అటవీ రక్షణ, వేట నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ ఆర్. శోభ వివరించారు. సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయంతో పాటు, చెక్ పోస్టులను పెంచామన్నారు. నమోదైన కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చూస్తున్నామని చెప్పారు.
టైగర్ రిజర్వులతో పాటు రిజర్వు అటవీ ప్రాంతాల్లో నిరంతరం నిఘా కోసం వాచర్ల బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అటవీ సమీప గ్రామాల ప్రజలను చైతన్యం చేసి, అటవీ నేరాల అదుపునకు వారి సహకారం తీసుకుంటున్నామని వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసి (18004255364) అటవీ నేరాల ఫిర్యాదుకు, పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. కిరుపాశంకర్, జాతీయ పులుల సంరక్షణ ఐజీ ఎన్.ఎస్.మురళి, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) సిద్దానంద్ కుక్రేటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్ జాయింట్ డైరెక్టర్ వినరు కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కర్జర్వేటర్లు ఎంజే. అక్బర్, సునీతా భగవత్, వైల్డ్ లైఫ్ ఓఎస్డీ శంకరన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.