Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణిలోని నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకభూమిక పోషిస్తున్నదని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు. సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందని, దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రంచ్ 13 కింద వేలం వేయదలిచిన జేబీఆర్ఓసీ-3, శ్రావన్ పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్లు వేలం వేస్తే సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. తక్షణం వేలం ప్రక్రియను నిలిపివేయమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించాలంటూ ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఈ బ్లాకులన్నింటినీ సింగరేణికే కేటాయించాలని కోరారు.