Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోనున్న 104 వాహనాలు
- రాష్ట్ర వ్యాప్తంగా 195 అంబులెన్సులు
- 14 ఏండ్లుగా మారుమూల పల్లెల్లో సేవలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్లు తొందరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ వైద్య సేవలందించే ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఏ ఉద్యోగిని ఎక్కడ ఎలా సర్దుబాటు చేయాలో ఆ అధికారులు విచారణ చేయనున్నారు. అయితే తమను సర్దుబాటు చేయకుండా.. అంబులెన్సులను రద్దు చేస్తే మా పరిస్థితి ఏంటని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
14 ఏండ్లుగా సేవలు..
పల్లెల్లో తాత్కాలిక వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతుందని ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 104 అంబులెన్సులను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 అంబులెన్సులు ఏర్పాటు చేసారు. అందులో 1250మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 26 అంబులెన్సులుండగా.. అందులో 152మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మారుమూల పల్లెల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాదులతో ఇబ్బంది పడుతున్న వారికి స్థానికంగానే వైద్యం అందించేందుకు ఈ అంబులెన్సులను ప్రారంభించారు. ఇందులో ఏఎన్ఎం, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, అంబులెన్స్ డ్రైవర్ను నియమించారు. అంబులెన్స్లో సిబ్బంది ప్రతి 20రోజులకు ఒకసారి గ్రామాలకు వెళ్లి బాధితులకు టెస్టులు చేసి మందులు, గోలీలు అందిస్తారు.
104పై ఎప్పుడూ నిర్లక్ష్యమే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 104 అంబులెన్స్లపై నిర్లక్ష్యం చూపిస్తూ వచ్చింది. ప్రతి ఏటా నిధుల కేటాయింపులో కోత విధిస్తూనే ఉంది. ఈ కోత వల్ల కొంత కాలంగా అంబులెన్స్ల మొయింటనెన్స్తోపాటు డీజిల్కు సైతం డబ్బులు లేక ఆగిపోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 8 అంబులెన్స్లు డీజిల్ లేని కారణంగా డిసెంబర్ 1 నుంచి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే, అంబులెన్సుల్లో మొదట్లో 45రకాల మందులు అందించేవారు. ప్రస్తుతం నాలుగైదు రకాల గోలీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ మందులు కూడా సరిగా రాకపోవడం వల్ల వైద్య సేవలు అందడం లేదు. ఈ అంబులెన్సులో పనిచేసే సిబ్బందికి కూడా ప్రతినెలా వేతనాలు వచ్చే పరిస్థితి లేదు.
ఆందోళనలో ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1250 మంది సిబ్బంది ఉన్నారు. గతంలో కొంత మందిని పీహెచ్సీ, సబ్ సెంటర్లకు డిప్యూటేషన్పై పంపించారు. అప్పటి నుంచి అంబులెన్స్లు గ్రామాలకు వచ్చిన సందర్భంలో 104సిబ్బందితో కలిసి ఏఎన్ఎంలు సేవలందిస్తున్నారు. అయితే, ఇప్పుడు 104 వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పల్లె దవాఖానాలు, పీహెచ్సీలు, ఆస్పత్రుల్లో సర్దుబాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మౌఖికంగా పెర్కొంటున్నప్పటికీ ఉత్తర్వులు రాలేదు. సిబ్బంది వేతనాల కోసం మార్చి వరకు బడ్జెట్ ఉందని అధికారులు పెర్కొంటున్నా.. ఆ తర్వాత ఉద్యోగులను సర్దుబాటు చేస్తారా.. లేదా అన్నది వారిలో ఆందోళనగా ఉంది.
మా సర్దుబాటు తర్వాతే అంబులెన్స్ను రద్దుచేయాలి
పి.శివకుమార్- రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మెడికల్, పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 104
104లో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసిన తర్వాతే అంబులెన్సులను రద్దు చేయాలి. లేకపోతే ఇన్నేండ్లుగా సేవ చేసిన తాము, కుటుంబాలు రోడ్డుపడాల్సి వస్తుంది. ఈ విషయంపై అధికారులు స్పష్టంగా ప్రకటించాలి.