Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- ఆలయంలో రమణ దంపతులకు ఘన స్వాగతం
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం శిల్ప సంపద అత్యద్భుతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శనివారం ఆయన రామప్ప ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. 800 ఏండ్ల కిందట నిర్మితమైన రామప్పకు యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. ఇసుక పునాదులపై ఆలయాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని తీర్చిదిద్దడం అద్భుతమైందన్నారు. శతాబ్దాలు గడిచిపోతున్నా ఆలయ నిర్మాణంలో వినియోగించిన రాయి రంగు చెక్కు చెదరకుండా కాంతులీనడం రామప్ప విశిష్టత విశ్వవ్యాప్తం కావడానికి ప్రధాన పాత్ర వహించాయని అన్నారు. ఆలయంలోని శిల్ప కళాకృతుల్లో 'నాగిని', నవరస సమ్మేళనంగా వీక్షకుల్లో చెరగని ముద్ర వేస్తున్నాయని చెప్పారు. పేరిణి శివతాండవంగా పేరొందిన వీరనాట్యం ఈ ఆలయ శిల్పాల్లో దాగి ఉండటం మరో విశేషమన్నారు.
తొలుత రామప్ప సందర్శనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, హైకోర్ట్ న్యాయవాదులు ఉజ్జల్ భూయన్, రాజశేఖర్రెడ్డి, వరంగల్ నవీన్రావు, జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి అనిల్కుమార్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మెన్ మహేష్నాథ్, ములుగు జూనియర్ సివిల్ జడ్జి రాంచందర్రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహబాబాబాద్ ఎంపీ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్వో రమాదేవి, వెంకటాపూర్ తహసీల్దార్ మంజుల పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.