Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు క్రమబద్ధీకరణ జీవో 16 అమలు సాధన సమితి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించడానికి వీలుగా ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలను విడుదల చేయాలని క్రమబద్ధీకరణ జీవో 16 అమలు సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు బుధవారం సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్ ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించారు. జీవో 16 అమలుకు అడ్డంకిగా ఉన్న పిల్ను హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లు మానసిక ఆదేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను జారీ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వెట్టిచాకిరీ, శ్రమదోపిడీ అయిన కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలనీ, క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 అమలుకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు. క్రమబద్ధీకరణకు అనుకూలంగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కెవియట్ వేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు.