Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీసీ ఇ కేటగిరీలో ఉన్న తురకకాశ, పత్తర్ పోడ్ సామాజిక తరగతుల పేర్లను జాతీయ వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చేర్చాలని తురక కాశ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు షేక్ ఇమామ్ పాషా, సయ్యద్ వలీ, ఉపాధ్యక్షులు ఖరీమ్ జాతీయ బీసీ కమిషన్ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశాయి. తురకకాశ, పత్తర్ పోడ్ సామాజిక తరగతుల ప్రజల జీవితాల గురించి కమిషన్కు తెలిపినట్టు పేర్కొన్నారు. వారు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారంటూ 2007లో రాష్ట్ర బీసీ కమిషన్ సర్వే చేసి గుర్తించిందని తెలిపారు. తాద్వారా వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చిందని గుర్తుచేశారు. జీవో నెం 23/ 2007 ప్రకారం గత దశాబ్దకాలంగా నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. అయితే జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో తురక కాశ, పత్తర్ పోడ్ సామాజిక తరగతుల పేర్లను చెప్పకపోవటం వలన జాతీయస్థాయి రిజర్వేషన్లు వీరికి అందడం లేదని వివరించారు. దీంతో జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో వీరికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. వివిధ సామాజిక తరగతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తురక కాశ, పత్తర్ పోడ్ తరగతుల ప్రజలను జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరారు.