Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తిరిగి మూడు దుర్మార్గ వ్యవసాయ చట్టాలను తెస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ప్రకటించడం రైతాంగాన్ని మోసం చేయడమేనని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే మోడీ చట్టాలపై వెనకకు తగ్గాడని వచ్చిన అభిప్రాయాలను నిజం చేసేదిగా తోమర్ ప్రకటన ఉందని తెలిపారు. ఏడాది పాటు రైతాంగం ఆందోళన చేసి చట్టాలను వెనకకు నెడితే తిరిగి దొడ్డి దారిన తీసుకొస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు. తమ అనుకూల కార్పొరేట్ వర్గమైన ఆదాని, అంబానీ లాబీని సంతృప్తి పరచడం కోసమే ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు. దేశ రైతాంగం కంటే కార్పొరేట్ లాబీ మీదనే మోడీ సర్కార్కి ప్రేమ ఎక్కువని విమర్శించారు. తిరిగి ఆ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.