Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కొణిజర్ల
మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో దెబ్బతిన్న మిర్చి పంటలను సీపీఐ(ఎం) బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. రైతులు మిర్చి పంటలను సాగుచేయగా వైరస్ల తాకిడికి లక్షల రూపాయలు నష్టపోయి అప్పులపాలై అత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారు లను గ్రామాల్లోకి పంపి పంటనష్టాన్ని అంచనా వేసి మిర్చి రైతులను ఆదుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అదే విధంగా ఇప్పటి వరకు అత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భద్రాచలం మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు, పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.